రిలయన్స్ జియో టవర్స్ ధ్వంసం: కేంద్రానికి, పంజాబ్కు హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో జియో టవర్స్ ధ్వంసంపై రిలయన్స్ జియో కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. తమ కంపెనీ సెల్ టవర్లను ధ్వంసం చేసిన స్వార్థ ప్రయోజన శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రిలయన్స్ జియో పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సమాధానం ఇవ్వాలంటూ పంజాబ్ ప్రభుత్వం, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసును 8వ తేదీకి వాయిదా వేసింది.
కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. రైతు ఆందోళనల నేపథ్యంలో తమ ప్రత్యర్థులు ఉద్దేశ్యపూర్వకంగా తమ టవర్లను టార్గెట్ చేశారని రిలయన్స్ జియో ఆరోపిస్తోంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కొందరు జియో టవర్లు ధ్వంసం చేశారు. అయితే ఇది తమ ప్రత్యర్థులు ఈ పని చేయవచ్చునని జియో అనుమానిస్తోంది. దీనిపై కోర్టుకు వెళ్లింది.
దీని వెనుక తమ వ్యాపార ప్రత్యర్థుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఆరోపించింది. ఇలాంటి విధ్వంసం నుండి తమ ఉద్యోగులు, ఆస్తులను కాపాడేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే జియో ఆరోపణలను ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఖండించాయి.