హీరో మోటోకార్ప్ ఛైర్మన్ ఇంట విషాదం:
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తిరుగులేని సంస్థగా ఎదిగిన హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు, దివంగత బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ భార్య సంతోష్ ముంజల్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశ రాజధానిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంతోష్ ముంజల్ కన్నుమూసినట్లు కొద్దిసేపటి కిందటే ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. హీరో మోటోకార్ప్ సంస్థ ఈ స్థాయికి చేరుకోవడానికి సంతోష్ ముంజల్ అహర్నిశలు శ్రమించారని సంతాపం తెలిపారు.
బ్రిజ్మోహన్ లాల్-సంతోష్ ముంజల్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రాక్మాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సుమన్ ముంజల్, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్, హీరో ఎంటర్ప్రైజెస్ సునీల్ ముంజల్ వారి కుమారులే. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హీరో మోటోకార్ప్ సంస్థ వ్యవస్థాపకుడైన బ్రిజ్ మోహన్ లాల్ 2015లోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. తన భర్త నెలకొల్పిన హీరో గ్రూప్ సంస్థను ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలపడంలో సంతోష్ ముంజల్ చేసిన సేవలు చిరస్మరణీయమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. హీరో సంస్థను నెలకొల్పిన తొలి రోజుల్లో తమ తండ్రికి బాసటగా ఆమె నిలిచారని, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సంస్థ అగ్రగామిగా ఎదగడానికి అహర్నిశలు శ్రమించారని చెప్పారు. తండ్రి సాధించిన విజయాల వెనుక తల్లి సంతోష్ ముంజల్ ఉన్నారని అన్నారు.