HDFC Bank: మార్కెట్లోకి కొత్త హెచ్డిఎఫ్సి షేర్లు.. సోమవారం నుంచే.. పూర్తి వివరాలు..
HDFC Bank: దేశంలోని బ్యాంకింగ్ చరిత్రలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ విలీనం కొత్త చరిత్ర సృష్టించింది. దీని తర్వాత బ్యాంక్ ప్రపంచంలోని అత్యంత విలువైన టాప్-4వ బ్యాంక్గా అవతరించింది.
అయితే విలీనం తర్వాత ఇకపై రెండు కంపెనీల షేర్లకు బదులు మార్కెట్లో ఒకటి మాయం కానుంది. దీనికి అనుగుణంగా బ్యాంక్ వాటాదారులకు షేర్లను కేటాయించింది. దీంతో సోమవారం నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్త షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ కానున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు రేపు రానున్న ఈ మార్పును తప్పక గమనించాల్సి ఉంటుంది.

బ్యాంక్ సుమారు 311 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. కంపెనీ HDFC Ltd షేర్హోల్డర్లకు ఇప్పటికే వారు కలిగి ఉన్న షేర్లకు ప్రతి 25 షేర్లకు బదులుగా 42 HDFC Bank షేర్లను అందించాలని నిర్ణయించింది. వీటిలో ఒక్కొక్కదాని ఫేస్ వ్యాల్యూ రూ.1గా దిగ్గజ బ్యాంక్ ప్రకటించింది. కొత్తగా లిస్టవుతున్న షేర్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుత ఈక్విటీ షేర్లతో సమానంగా ఉంటాయని వెల్లడైంది. దీని ఫలితంగా బ్యాంక్ పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ 559.18 కోట్ల షేర్ల నుంచి 753.75 కోట్ల షేర్లకు పెరుగనుంది.
విలీనం తర్వాత బ్యాంక్ షేర్హోల్డింగ్ విధానం పూర్తిగా పబ్లిక్ షేర్హోల్డర్ల యాజమాన్యంలో ఉన్నట్లు కంపెనీ వెల్లడిస్తుంది. అలాగే కేటగిరీ-I కింద విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు 50.46% వాటాను కలిగి ఉన్నారు. సింగపూర్ ప్రభుత్వం విలీనం తర్వాత బ్యాంక్ వ్యాపారంలో 2.67% వాటాను కలిగి ఉండగా, ఇన్వెస్కో మార్కెట్స్ ఫండ్ 1.21% వాటాలను కలిగి ఉంది. మార్చి చివరి నాటికి బ్యాంకులో మ్యూచువల్ ఫండ్స్ క్యుములేటివ్ హోల్డింగ్స్ 18.47% నుంచి 19.13%కి పెరిగాయి. ఇన్సూరెన్స్ కంపెనీల వాటా 8.71% ఉండగా.. ఎల్ఐసీ 4.89 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.
HDFC బ్యాంక్, HDFC లిమిటెడ్ సంస్థల 40 బిలియన్ డాలర్ల విలీనం జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. జూలై 13న హెచ్డిఎఫ్సి లిమిటెడ్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ నిలిచిపోయింది. షేర్ల జారీకి అర్హత కలిగిన షేర్హోల్డర్లను ఎంపిక చేయడానికి బ్యాంక్ జూలై 12ని రికార్డ్ డేట్గా ఎంచుకుంది.


Click it and Unblock the Notifications