యూటర్న్ తీసుకున్న HCLTech.. డేటా సెంటర్లపై రూ. 3,500 కోట్ల పెట్టుబడి.. భారీ ఇన్వెస్ట్ వెనుక వ్యూహం ఇదే..
భారత మూడవ అతిపెద్ద ఐటీ దిగ్గజం హెచ్సిఎల్ టెక్నాలజీస్ .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవల మార్కెట్ను చేజిక్కించుకోవడానికి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే HCLTech కంపెనీ బోర్డు సుమారు రూ. 3,500 కోట్లు (దాదాపు $365 మిలియన్లు) పెట్టుబడితో పూర్తి స్థాయి ఏఐ డేటా సెంటర్లను (AI Data Centres) ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా హెచ్సిఎల్ టెక్నాలజీస్.. ప్రాథమికంగా ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్లను గరిష్టంగా 50 మెగావాట్ల సామర్థ్యానికి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.ఈ డేటా సెంటర్ల స్థాపన, నిర్వహణ కోసం హెచ్సిఎల్ టెక్నాలజీస్ నేతృత్వంలో సరికొత్త అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఇది వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సహాయపడనుంది.

ఐటీ రంగంలో ఆస్తి పరిమాణాన్ని తక్కువగా ఉంచుకునే మునుపటి అసెట్-లైట్ వ్యూహానికి భిన్నంగా కంపెనీ ఈ పెట్టుబడులను పెడుతోంది. HCLTech సుమారు రూ. 3,500 కోట్ల ($365 మిలియన్లు) భారీ పెట్టుబడితో స్వంత డేటా సెంటర్లను నిర్మించే ప్రణాళికను ప్రకటించడం టెక్ రంగంలో మరిన్ని కంపెనీలు ఏఐ పెట్టుబడులకు బీజం వేసినట్లుగా చెప్పవచ్చు. . కేవలం తొమ్మిది నెలల క్రితం వరకు ఇలాంటి భారీ ఆస్తుల ఆధారిత వ్యాపారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నదిగ్గజ కంపెనీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల విభాగంలో ప్రధాన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ వ్యూహాత్మక మార్పును చేపట్టడం ఆశ్చర్యపరిచే పరిణామంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ వరుస ప్రాతిపదికన 0.9 శాతం ఆదాయ క్షీణతను చవిచూడగా.. వార్షిక ప్రాతిపదికన (YoY) 3 శాతం స్వల్ప వృద్ధితో 3.65 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం వ్యాపారంలో దాదాపు 10శాతం వాటా కలిగిన టెలికాం, మీడియా, వినోద రంగాలు బలహీనంగా సాగడం వల్లే వృద్ధి మందగించినట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ ఉత్పాదకత పెరగడం వల్ల కంపెనీ నికర లాభం వరుస ప్రాతిపదికన 0.4 శాతం, వార్షిక ప్రాతిపదికన 8.4 శాతం వృద్ధితో 488 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే కార్యాచరణ మార్జిన్లు కూడా 40 బేసిస్ పాయింట్లు పెరిగి 16.9 శాతంగా నమోదయ్యాయి. గత నాలుగేళ్లలోనే అత్యంత బలహీనమైన పూర్తి-సంవత్సర ఆదాయ వృద్ధి అంచనాలను కలిగి ఉన్నప్పటికీ.. స్థిర కరెన్సీ పరంగా ఈ ఆర్థిక సంవత్సరంలో (FY27) 1 శాతం నుండి 4 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమనే తన ఏప్రిల్ నాటి ముందస్తు అంచనాలను (Guidance) HCLTech యథాతథంగా కొనసాగించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పరిష్కారాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కేవలం పాత ఐటీ సేవలకు పరిమితం కాకుండా.. మౌలిక సదుపాయాల నుండి సాఫ్ట్వేర్ అప్లికేషన్ల వరకు అన్ని రకాల సేవలను అందించే ఫుల్-స్టాక్ ఏఐ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ గా ఎదగడమే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
హెచ్సిఎల్ టెక్నాలజీస్ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సి. విజయకుమార్ మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత డిమాండ్, మార్కెట్లో ఉన్న సరఫరా లోపాలు, డిజిటల్ సార్వభౌమాధికారం వంటి అంశాలు మాకు ఫుల్-స్టాక్ ఏఐ ప్రొవైడర్గా మారడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పించాయి. ఈ పెట్టుబడి మా గ్లోబల్ క్లయింట్లకు మరింత నాణ్యమైన సేవలను అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఐటీ పరిశ్రమలో క్లయింట్లు తమ సాధారణ సాంకేతిక ఖర్చులను తగ్గిస్తున్న తరుణంలో.. హెచ్సిఎల్ టెక్ తీసుకున్న ఈ రూ. 3,500 కోట్ల భారీ నిర్ణయం కంపెనీని భవిష్యత్ ఏఐ విప్లవానికి సిద్ధం చేయడంలో అత్యంత కీలకంగా మారనుందని తెలిపారు.


Click it and Unblock the Notifications
