హెచ్సీఎల్ సంచలనం: ఐటీ ఉద్యోగులకు భవిష్యత్తు భద్రత!
ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఐటీ సేవల రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కోట్లు ఖర్చుపెట్టి చేసే ప్రాజెక్టులకు ఇప్పుడు కొన్ని లక్షలు ఇవ్వడానికి కూడా కంపెనీలు వెనకాడుతున్నాయి.
దీంతో కొత్త ప్రాజెక్టులు, ముఖ్యంగా పెద్ద డీల్స్ దక్కించుకోవడం పగటి కలలా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతి కంపెనీ తమ వ్యాపారాన్ని, ఆదాయాన్ని వృద్ధి పథంలో కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ఇందులో భాగంగానే, టీసీఎస్, హెచ్సీఎల్ వంటి కంపెనీలు తమ సంప్రదాయ ఐటీ సేవలను దాటి, ఇండియాలో ఏర్పాటు చేసిన ఏఐ డేటా సెంటర్ల ద్వారా ఆదాయం పొందేందుకు కొత్త భాగస్వామ్యాలను కుదుర్చుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే, రోష్ని నాడార్, సి. విజయకుమార్ నేతృత్వంలోని హెచ్సీఎల్.. భారత ఐటీ సేవల రంగంలోనే తొలిసారిగా ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్య తరహా సంస్థలకు (SMEs) ఐటీ సేవలు అందించేందుకు, వారిని తమ ప్రధాన కస్టమర్లుగా మార్చుకునే లక్ష్యంతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
సాధారణంగా భారత ఐటీ కంపెనీలు 'ఫార్చ్యూన్ 500' కంపెనీలనే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ హెచ్సీఎల్ మాత్రం అందుకు భిన్నంగా, ఎక్కువ మంది కస్టమర్లను, అదనపు ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుని చిన్న కంపెనీల వైపు చూస్తోంది. ఇందుకోసమే 'Neo.AI' అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది.
ఈ విభాగం ఇకపై చిన్న, మధ్య తరహా సంస్థల అవసరాలకు తగినట్లుగా హెచ్సీఎల్ ఏఐ ప్లాట్ఫామ్, ఐటీ సేవలను ఉపయోగించుకోనుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్ వంటి సేవలను అందించనుంది.
ఈ విభాగం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలిగితే, మరింత మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి భద్రత కల్పించవచ్చు. అలాగే, ఈ కంపెనీలకు ఏఐ ద్వారా సేవలు అందించడం వల్ల ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేసే వీలుంటుంది.
ఇలాంటి వ్యాపార నమూనాను యాక్సెంచర్ (Accenture) ఇప్పటికే అమలు చేస్తోంది. ఇప్పుడు హెచ్సీఎల్ దానిని కాపీ కొట్టిందని చెప్పవచ్చు. దీనిని అనుసరించి, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీ వంటి ఇతర భారత ఐటీ కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది.
హెచ్సీఎల్ తీసుకున్న ఈ కొత్త చొరవ, మిగతా 5 కంపెనీల కంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని అందిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అదే సమయంలో, హెచ్సీఎల్ నిర్ణయం వల్ల దేశంలోని ఇతర చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీల వ్యాపారం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా, 'ఫార్చ్యూన్ 500' కంపెనీలను కాకుండా చిన్న సంస్థలకే ఎక్కువగా సేవలు అందిస్తున్న కోఫోర్జ్ (Coforge), పర్సిస్టెంట్ సిస్టమ్స్ (Persistent Systems), ఎంఫసిస్ (Mphasis) వంటి సంస్థలకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పుడు హెచ్సీఎల్ వంటి దిగ్గజాలు కూడా ఈ మార్కెట్లోకి వస్తే, ఐటీ సేవల రంగంలో కొత్తగా 'కన్సాలిడేషన్ ఫేజ్' (consolidation phase) మొదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications