క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఏమన్నారంటే
క్రిప్టోకరెన్సీ గురించిన ఆందోళనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆయన శుక్రవారం వెల్లడించారు. డిజిటల్ కాయిన్స్ పైన తమ వైఖరిలో మార్పులేదని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ బిజినెస్ సేవలపై ఇటీవల పలు బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేశాయి. దీనిపై ఆర్బీఐ ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది. తాజాగా శక్తికాంత దాస్ మరోసారి క్రిప్టోకరెన్సీపై స్పందించారు.
'క్రిప్టోకరెన్సీ గురించి తమకు ఆందోళనలు ఉన్నాయి. దీనిని తాము ప్రభుత్వానికి తెలియజేశాము. పెట్టుబడిదారుల సలహాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధిత సలహాలు ఇవ్వదు. ప్రతి ఇన్వెస్టర్ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందు సొంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. సొంతగా మదింపు చేసుకోవడం, జాగ్రత్తగా ఉండటం అవసరం.' అని శక్తికాంత దాస్ అన్నారు.
క్రిప్టోకరెన్సీకి సంబంధించి తమ తీరులో ఎలాంటి మార్పులేదని, తమ సర్క్యులర్లో పూర్తి స్పష్టత ఉందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. వివిధ బ్యాంకులు క్రిప్టో ట్రాన్సాక్షన్స్కు సంబంధించి తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేయగా, ఆర్బీఐ మే 31న ఓ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే.