హాల్మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
బంగారు ఆభరణాలకు జనవరి 2020 నుంచి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయడం వల్ల కస్టమర్లకు భరోసా లభించినట్లు అవుతుందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ అన్నారు. 2001లో హాల్ మార్క్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కొందరు వ్యాపారులు మాత్రమే దీనిని స్వచ్చంధంగా పాటిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనిని తప్పనిసరి చేయడంతో వ్యాపారులకు జవాబుదారీతనం వస్తుందన్నారు.
మోసపూరితంగా, కొనుగోలుదార్లను వేధించేలా వ్యవహరించే వారి ఆటలు సాగవన్నారు. తగిన హామీతో నాణ్యత కలిగిన ఆభరణాలే విక్రయించాల్సి వస్తుందని, కాబట్టి పరిశ్రమపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు.
హాల్ మార్కింగ్ సెంటర్లు సరైన పద్ధతులు పాటించేలా, ఆభరణాల పరీక్షలో గ్రేడ్లు, ప్రమాణాలు దేశవ్యాప్తంగా ఒకేరకంగా ఉండేలా ప్రభుత్వం పర్యవేక్షించాలన్నారు. ఆభరణాలపై బార్ కోడ్ వేస్తే నకిలీ ధ్రవీకరణలకు అవకాశం ఉండదన్నారు. హాల్ మార్క్ సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో 860కి పైగా హాల్ మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. హాల్ మార్కింగ్ చేసిన ఆభరణాల వ్యవస్థను డిజిటల్ వ్యవస్థ ద్వారా పరిశీలిస్తే అనధికారిక ట్రాన్సాక్షన్లను కూడా అరికట్టవచ్చునన్నారు.