జీఎస్టీ భారం మరో 3 శాతం: రాష్ట్రాల ఒత్తిడి, సెస్ పెంచనున్న కేంద్రం?
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా జీఎస్టీ రెవెన్యూ కలెక్షన్లు తగ్గుతున్నాయి. వివిధ వస్తువులను ఎక్కువ స్లాబ్ నుంచి తక్కువ స్లాబ్లోకి తీసుకు రావడంతో ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ తగ్గింది. దీంతో పాటు ఇటీవలి మందగమనం కారణంగా వినిమయ శక్తి తగ్గడం కూడా ఓ కారణం. జీఎస్టీ ఆదాయం అంచనాలకు అనుగుణంగా రావడం లేదు. దీంతో పన్ను రేట్లు పెంచి స్లాబ్స్ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
SBIకి రూ.862 కోట్ల లాభానికి బదులు రూ.7,000 కోట్ల నష్టం!
18న భేటీలో రాష్ట్రాలకు ఇచ్చే పరిహారంపై చర్చలు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ నెల 18వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మంగళవారం అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా జీఎస్టీ రెవెన్యూ తగ్గుతుండటంతో ఇందులో మార్పులు చేసే అంశంపై కూడా చర్చించనున్నారు.
పన్ను రేట్లు
ప్రస్తుతం వివిధ వస్తువులపై 0, 5, 12, 18, 28 జీఎస్టీ స్లాబ్ రేట్లు ఉన్నాయి. లగ్జరీ, ప్రమాదకర వస్తువులపై 28 శాతం పన్ను ఉంది. దీనిపై అదనంగా 1 నుంచి 25 శాతం సెస్ ఉంది. అయితే ఈ జీఎస్టీ సమావేశంలో పన్ను స్లాబ్స్ను 3 విభాగాలకే కుదించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సున్నా పన్ను రేటు మినహాయించి మిగతా నాలుగింటిని కుదించే అవకాశముంది.
5 శాతం 8కి పెంపు
5 శాతం పన్ను రేటును 8 శాతానికి, 12 శాతం పన్ను రేటును 15 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. 12 శాతాన్ని, 18 శాతం స్లాబ్లో విలీనం చేయవచ్చునని కూడా భావిస్తున్నారు. విలీనం చేయకుంటే మాత్రం 18 శాతాన్ని 22 నుంచి 25 శాతానికి పెంచవచ్చునని భావిస్తున్నారు. అలాగే, జీఎస్టీకి అదనంగా విధించే సుంకాన్ని కూడా పెంచే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
వీటి ధరలు పెరిగే ఛాన్స్
ప్రస్తుతం 5 శాతం స్లాబ్లో కాఫీ, శీతలీకరించిన కూరగాయలు, ప్రాసెస్ చేసిన సుగంధ ద్రవ్యాలు, రస్క్లు, సోయాబిన్, ఇడ్లీ పిండి, దోశ పిండి, వంట నూనెలు, బ్రాండెడ్ పన్నీరు, వేరుసెనగ, అగ్గిపెట్టెలు, పాలపొడి, స్టీల్ పాత్రలు, ఔషధాలు, రూ.1,000 లోపు పాదరక్షలు, తక్కువ ధర దుస్తులు, దారం, కిరోసిన్, బొగ్గు, ఇన్సులిన్, ఎరువులు, విద్యుత్ వాహనాలు, ఈ-బుక్స్ ఉన్నాయి. వీటితో పాటు రైళ్లలో సరుకు, ప్రయాణీకుల రావాణా, రేడియో ట్యాక్సీ, మోటార్ క్యాబ్ రెంట్, ఏసీ కాంట్రాక్ట్, స్టేజ్ క్యారియర్, విమాన రవాణా, పర్యాటక ఆపరేటర్, వార్తా పత్రికల ముద్రణ వంటి అంశాలు కూడా ఇదే స్లాబ్లో ఉన్నాయి. జీఎస్టీ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి పెంచితే ఈ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. విలాస వస్తువులు, సిగరేట్లు, గుట్కా వంటి అనారోగ్య ఉత్పత్తులపై 28 శాతం ఉంది. వీటిపై 25 శాతం వరకు సెస్ కూడా ఉంది. 12 శాతం స్లాబ్లో 243 వస్తువులు ఉన్నాయి. 12 శాతం స్లాబ్ను 18 శాతంలో విలీనం చేస్తే ఈ వస్తువులపై పన్ను రేటు నికరంగా 6 శాతం పెరగనుంది. 15 శాతానికి పెంచితే 3 శాతం భారం కానుంది.
రాష్ట్రాల ఒత్తిడితో సెస్ పెంచే యోచన
స్లాబ్స్ మార్చడంతో పాటు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న జాబితాలోని కొన్ని వస్తువులను చేర్చే అవకాశాలపై చర్చించనున్నారు. ఆ వస్తువులపై పన్ను విధించవచ్చు. అలాగే, పన్ను రూపంలో నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం ఇస్తున్నారు. దీనిని పెంచాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఉత్పత్తులపై సెస్ పెంచే అవకాశాలు ఉన్నాయి. పలు రాష్ట్రాలకు పన్ను పరిహారం చెల్లింపులు పెండింగులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదనపు వనరుల కోసం పన్ను రెట్లు పెంచడం తప్ప మరో మార్గంలేదని భావిస్తోంది కేంద్రం.
వాస్తవానికి భిన్నంగా...
జీఎస్టీ అమలు వల్ల ఆయా రాష్ట్రాలకు ఏర్పడ్డ ఆదాయ లోటును పూడ్చేందుకు వీలుగా కేంద్రం గరిష్ఠ పన్ను స్లాబ్కు అదనంగా పరిహార సుంకం వసూలు చేస్తోంది. పరిహారం పెంచాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత నెలలో సుంకం వసూళ్లు రూ.7,720 కోట్లకు తగ్గాయి. అదనంగా పెంపు ద్వారా నెలవారీ సుంకం ఆదాయం రూ.10,000 కోట్ల వరకు పెంచుకునేందుకు కేంద్రం చూడవచ్చునని అంటున్నారు. 2020 ఏప్రిల్ నుంచి నెలకు కేంద్రం పంచాల్సిన పరిహార మొత్తం రూ.21 వేల కోట్ల పెరగనుంది.
అనుకున్న దాని కంటే ఎంతో తక్కువ వసూళ్లు
2017 అమల్లోకి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ నెల మధ్య జీఎస్టీ ఆదాయం లక్ష్యం కంటే 40 శాతం తగ్గింది. ఈ నెలల్లో రూ.5,26,000 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా, రూ.రూ.3,28,365 కోట్లు మాత్రమే వచ్చింది. 2018-19 అంచనా రూ.6,03,900 కోట్లు కాగా రూ.4,57,534 కోట్లు మాత్రమే వచ్చింది. జీఎస్టీ ప్రారంభమైన 2017-18లో కేంద్ర జీఎస్టీ రూ.2,03,261 కోట్లు వచ్చాయి.