వరుసగా రెండో నెల... ప్రభుత్వానికి భారీ ఊరట: ఏపీ-తెలంగాణ కలెక్షన్లు ఎంతంటే?
డిసెంబర్ 2019 జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్లు దాటాయి. నవంబర్, డిసెంబర్... వరుసగా రెండో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,03,184 కోట్లుగా ఉన్నాయి. నవంబర్ నెల కంటే తగ్గినా, 2018 డిసెంబర్ కంటే మాత్రం వసూళ్లు పెరిగాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో గత కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. ఇప్పుడు కేంద్రం చర్యలతో వినియోగం పుంజుకుంటోందనేందుకు నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. జీఎస్టీ కలెక్షన్లు పెరగడానికి వివిధ కారణాలున్నాయి.
డిసెంబర్లో రూ.1 లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ వసూళ్లు పెరుగుదల శుభసూచకం
పన్ను లక్ష్యాలను చేరుకోవడానికి ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్ను వసూళ్లను పెంచాలని గత నెలలో సంబంధిత శాఖ అధికారులకు రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సూచించారు. గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన జీఎస్టీ రెవెన్యూ ఇప్పుడు పెరగడం శుభసూచకమని డెలాయిట్ డైరెక్టర్ మణి అన్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు నియంత్రణలో ఉంటుందన్నారు. వచ్చే నెలల్లో ఈ-ఇన్వాయిస్, కొత్త రిటర్న్స్ అమలులోకి రానుండటంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వానికి ఊరట
జీఎస్టీ వసూళ్లు వరుసగా 2 నెలలు పెరగడంతో వినియోగ డిమాండ్ గాడిన పడుతోందని భావిస్తున్నారు. గత రెండు క్వార్టర్లలో జీడీపీ వృద్ధి 5 శాతానికి, 4.5 శాతానికి పడిపోవడానికి పెట్టుబడులు, వినిమయ డిమాండ్ తగ్గడమే కారణం. ఇప్పుడు వినిమయం పెరుగుతుందనే అంశం ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశం. ప్రతి నెల రూ.1.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లను ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. రానున్న రోజుల్లోను నెలసరి జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్లు సులభంగా దాటే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో పెరుగుదల
జీఎస్టీ వసూళ్లు అరుణాచల్ ప్రదేశ్లో రెండు రెట్లు, నాగాలండ్లో 88 శాతం, మణిపూర్లో 64 శాతం, మిజోరాంలో 60 శాతం చొప్పున పెరిగాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోను జీఎస్టీ కలెక్షన్లు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పదకొండు శాతం, తెలంగాణలో పదమూడు శాతం పెరిగాయి. ఏపీలో రూ.2,265 కోట్లు, తెలంగాణలో రూ.3,420 కోట్లు వచ్చాయి.