డిసెంబర్లో రూ.1 లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
డిసెంబర్ 2019లో జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్లు దాటాయి. మందగమనం నేపథ్యంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. వరుసగా రెండో నెల (నవంబర్, డిసెంబర్) జీఎస్టీ కలెక్షన్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. నవంబర్ నెలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో 2018 డిసెంబర్తో పోలిస్తే 9 శాతం పెరిగాయి.
డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,03,184 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.19,962 కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లూ రూ.26,972 కోట్లు, ఐజీఎస్టీ వసూళ్లు రూ.48,099 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.21,295 కోట్లు దిగుమతులపై వసూలు చేసిన పన్ను కూడా కలిపి ఉంది. సెస్ రూపంలో రూ.8,331 కోట్లు వచ్చాయి.
కొత్త ఏడాదిలో శుభవార్త: 7లక్షల ఉద్యోగాలు, ఈ రంగంలో ఎక్కువ, శాలరీ పెరుగుదల మాత్రం..
2019-20 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఏప్రిల్లో రూ.1,13,865 కోట్లు, మేలో రూ.1,00,289 కోట్లు, జూన్లో రూ.99,939 కోట్లు, జూలైలో రూ.1,02,083 కోట్లు ఆగస్ట్లో రూ.98,202 కోట్లు, సెప్టెంబర్లో రూ.91,916 కోట్లు, అక్టోబర్ నెలలో రూ.95,380 కోట్లు, నవంబర్లో రూ.1,03,492 కోట్లు, డిసెంబర్లో రూ.1.03,184 కోట్లు వసూలయ్యాయి.
అంతకుముందు వరుసగా మూడు నెలలు రూ.1 లక్ష కోట్ల కంటే తక్కువ వసూళ్లయినప్పటికీ నవంబర్, డిసెంబర్ నెలల్లో క్రమంగా పెరిగాయి. అంతేకాదు, 2018లోని అదే నెలలో కంటే వసూళ్లు పెరిగాయి. అదే సమయంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం 2018లో అవే నెలల్లో కంటే వసూళ్లు తగ్గాయి. కేంద్రం చర్యలతో వసూళ్లు పెరిగాయి.