GST Facility: దేశంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానాన్ని వ్యాపారులు సైతం విస్తృత స్థాయిలో స్వీకరిస్తున్నారు. చిన్న వ్యాపారుల నుంచి పెద్దవారి వరకు అనేక మంది ఇప్పటికే దీని కింద నమోదయ్యారు.
తాజాగా మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే వ్యాపారులు తమ పన్నును క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వ్యాపారులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు GSTN వెల్లడించింది. తర్వాతి దశలో మిగిలిన రాష్ట్రాలకు సైతం దీనిని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వ్యాపారులు GSTN పోర్టల్లో ఆన్లైన్, ఆఫ్లైన్లో చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ పద్ధతుల్లో నెట్ బ్యాంకింగ్, తక్షణ చెల్లింపు సేవలు(IMPS), యూపీఐ విధానాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో దేశంలో జీఎస్టీ రిటర్న్ దాఖలు చేసేవారి సంఖ్య 65 శాతం పెరిగింది. ఏప్రిల్ 2023 నాటికి GST రిటర్న్లను దాఖలు చేసే వారి సంఖ్య 1.13 కోట్లకు చేరుకుంది. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగాయి.
వ్యాపారులు చెల్లింపులు చేసేందుకు రూపే, మాస్టర్ కార్డ్, వీసా, డైనర్స్ కార్డులను జీఎస్టీఎన్ అనుమతిస్తోంది. దిల్లీ, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో తొలివిడత కార్డు పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ రాష్ట్రాల్లో ఇకపై GSTN పోర్టల్లో ఇ-చెల్లింపు ఎంపికలో క్రెడిట్/డెబిట్ కార్డ్ ఎంపికలు అందుబాటులోకి వస్తున్నాయి.
రూ.5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన కంపెనీలు, వ్యాపారులకు ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి. ఈ విధానం మార్చి 1, 2024 నుంచి అమలులోకి రానుంది. జీఎస్టీ నిబంధనల ప్రకారం వ్యాపారులు రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించాలంటే ఈ-వే బిల్లు తప్పనిసరి. జీఎస్టీ చెల్లించే ఈ-చలాన్కు అర్హులైన వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కస్టమర్లు, ఇతర రకాల లావాదేవీల కోసం ఈ-వే బిల్లులను రూపొందించడానికి ఈ-ఇన్వాయిస్ అవసరం ఉండదు.


Click it and Unblock the Notifications