GST May 2021: మైనస్లోకి: రూ.39 వేల కోట్లు తక్కువగా
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని ఆవరించుకున్న వేళ.. ఇది వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అనేక రాష్ట్రాలు తమకు తాముగా ఆంక్షలను విధించుకుని, లాక్డౌన్లోకి జారిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వస్తు, సేవా పన్నుల (GST) వసూళ్లపై దాని ప్రభావం తీవ్రంగా పడింది. ఫలితంగా ఆశించిన స్థాయిలో దాని రాబడి నమోదు కాలేదు. మే నెలలో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్లోకి వెళ్లిన ప్రభావం ఆ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లపై కనిపించాయి. ఏప్రిల్ నాటి వసూళ్లతో పోల్చుకుంటే 39 వేల కోట్లు తగ్గాయి.
కిందటి నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,02,709 కోట్ల రూపాయలు. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో నమోదైన జీఎస్టీ కలెక్షన్లు.. నెల తిరిగే సరికి పడిపోయాయి. ఏప్రిల్లో 1,41,384 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్లు రికార్డయ్యాయి. దేశంలో జీఎస్టీ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత.. ఈ స్థాయిలో వసూళ్లు ఎప్పుడూ నమోదు కాలేదు. ఆ దూకుడుకు బ్రేక్ పడింది..కొనసాగలేకపోయింది. మే నెలలో 1,02,709 కోట్ల రూపాయల వద్ద నిలిచిపోయిందా సంఖ్య.
ఈ మొత్తంలో సెంట్రల్ జీఎస్టీ (CGST)-17,592 కోట్లు కాగా.. స్టేట్ జీఎస్టీ (SGST)-22,653 కోట్ల రూపాయలు.ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రెవెన్యూ మొత్తం 53,199 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇందులో సరుకుల దిగుమతి ద్వారా నమోదైన జీఎస్టీ మొత్తం 26,002 కోట్ల రూపాయలు. వేర్వేరు రంగాలపై విధించిన సెస్ ద్వారా 9,265 కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై విధించిన పన్నుల ద్వారా 868 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఈ మొత్తాన్ని 9,265 కోట్ల 9,265 కోట్ల రూపాయల్లోనే కలిపేశారు.
కాగా- లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం వరుసగా ఇది ఎనిమిదోసారి. ఇదివరకు ఏడు నెలలుగా నెలవారీ జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు పైగా నమోదవుతున్నాయి. ఏప్రిల్తో పోల్చుకుంటే.. ఆ తరువాతి నెలలో నమోదైన జీఎస్టీ వసూళ్లల్లో 38,675 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వల్ల సంక్షోభకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. లక్ష కోట్లకుపైగా జీఎస్టీ వసూళ్లు అందాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ బకాయిలను కూడా పెద్ద సంఖ్యలో చెల్లించడం వల్లే ఈ మార్క్ అందుకున్నట్టయిందని స్పష్టం చేసింది.