'గ్రేట్ రిజిగ్నేషన్' అనేది ఇటీవల పుట్టుకు వచ్చిన పదం. దీనిని 'బిగ్ క్విట్' అని కూడా పిలుస్తున్నారు. ఉద్యోగులు తమ తమ ఉద్యోగాలకు స్వచ్చంధంగా రాజీనామాను సమర్పించడమే గ్రేట్ రిజిగ్నేషన్. గ్రేట్ రిజిగ్నేషన్ 2019లో మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆంథోని కియోట్జ్ నండి ప్రారంభమైందని చెబుతారు. ఇప్పుడు మన దేశంలోను ఐటీ రంగం దీని బారిన పడింది. ప్రమోషన్స్ లేదా అధిక వేతనాల కోసం ఉన్న కంపెనీలో రాజీనామా చేసే వారి సంఖ్య పెరుగుతోంది.
మన దేశంలోను గ్రేట్ రిజిగ్నేషన్ క్రమంగా ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఐటీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఈ బారిన పడుతున్నాయి. ఉద్యోగులను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.

టీసీఎస్ ఏం చేసిందంటే
టీసీఎస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి అంటే తొమ్మిది నెలల కాలంలో 77,000 ఉద్యోగులను నియమించుకుంది. అంతకుముందు పూర్తి ఏడాదితో పోల్చినా ప్రస్తుత తొమ్మిది నెలల కాలంలో ఫ్రెషర్ల నియామకం చాలా ఎక్కువే ఉందని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ స్వయంగా తెలిపారు. ప్రధానంగా కంపెనీ అధిక ఆట్రిషన్ రేటును ఎదుర్కొంటోంది.
దీంతో ఉద్యోగులను కాపాడుకునేందుకు వివిధ చర్యలు చేపట్టింది. 'అంతర్గతంగా పదోన్నతులు ఇవ్వడంతో పాటు విదేశీ అవకాశాలు ఇప్పించడం, 1,10,000 మందికి ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా కంపెనీ తన ఉద్యోగులను అట్టిపెట్టుకోగలిగిందని, సరఫరా వైపు సమస్యలను అధిగమించిందని' చెప్పారు.

అధిక ఆట్రిషన్ రేటు
ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ భారీ ఆట్రిషన్ను ఎదుర్కొంటోంది. గత కొంతకాలంగా అధిక ఆట్రిషన్ లేదా ఉద్యోగుల వలసల రేటును ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలోను ఎదుర్కొంది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ ఆట్రిషన్ రేటు 20.1 శాతంగా ఉంటే ఇప్పుడు 25.5 శాతానికి పెరిగింది.
ఇక గత మూడు నెలల్లో టీసీఎస్ ఉద్యోగుల వలసల రేటు 15.3 శాతంగా నమోదు అయింది. అంతకుముందు త్రైమాసికంలో 11.9 శాతంగా ఉంది.
విప్రో ఆట్రిషన్ రేటు కూడా అధికంగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో 20.5 శాతంగా ఉన్న ఆట్రిషన్ రేటు డిసెంబర్ త్రైమాసికం నాటికి 22.7 శాతానికి పెరిగింది.

అడ్డుకట్ట వేసేందుకు..
వలసలకు అడ్డుకట్ట వేసేందుకు టీసీఎస్ కంపెనీ గడిచిన తొమ్మిది నెలల్లో 1.10 లక్షల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చింది. మార్చిలోగా మరో 40,000 మందికి ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా దాదాపు అదే దారిలో నడిచాయి. ఐటీ కంపెనీ నిపుణుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ముందుచూపుతో ఎక్కువ మంది ఫ్రెషర్స్ను తీసుకొని, కొన్ని సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications