మంచి ప్రోత్సాహం: ప్రధానిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
ప్రధాని నరేంద్ర మోడీని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. నిన్న (ఫిబ్రవరి 10 బుధవారం) లోకసభలో మోడీ తన ప్రసంగంలో ప్రయివేటు సంస్థల్ని ప్రశంసించారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోడీ బుధవారం లోకసభలో మాట్లాడారు. దేశ అభివృద్ధిలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
ఈ రంగంలో అందరికీ అవకాశాలుంటాయన్నారు. ప్రయివేటు రంగం కూడా ముఖ్యమని ప్రధాని చెప్పడంతో ఆ రంగానికి చెందిన పలు సంస్థలు మోడీని కొనియాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ తెలిపారు. కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న ప్రయివేటు సంస్థలకు ప్రధాని ప్రోత్సాహకరమైన మాటలు ఎంతో ఉత్తేజాన్నిచ్చాయిని, దీనిని స్వాగతిస్తూ మనం అంచనాలను అందుకోవాలని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో ప్రోత్సాహకం అన్నారు.
JSW అధినేత సజ్జన్ జిందాల్ కూడా మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రయివేటు రంగంపై తనకు ఉన్న గౌరవాన్ని ప్రధాని మొదటిసారి బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆయన మాటలు ప్రయివేటు రంగానికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయన్నారు. ఈ దేశానికి సంపదను సృష్టిస్తున్న, ఉద్యోగాలు కల్పిస్తున్న రంగానికి ఇది ఎంతో ఉత్సాహకరమైనదన్నారు.