Gowtham Adani: రాగి తయారీలోకి అదానీ అరంగ్రేట్రం.. రూ.6,071 కోట్లతో ప్లాంట్.. ఎక్కడంటే..
Gowtham Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ గత ఏడాది కాలంగా విస్తరణ, కొత్త వ్యాపాల కొనుగోలులో దూకుడు పెంచారు. పవర్, ఇన్ ఫ్రా, ట్రాన్స్ మిషన్, సోలార్ ఎనర్జీ, సిమెంట్ ఇలా అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న ఆయన తాజాగా కాపర్(రాగి) వ్యాపారంలోకి ప్రవేసించనున్నారు. సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఏడాదికి ఒక మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న రాగి కర్మాగారాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీని నిర్మాణానికి రూ.6,071 కోట్ల రుణాన్ని సేకరించేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. కమోడిటీస్ దిగ్గజం అనిల్ అగర్వాల్ తమిళనాడులోని తన రాగి యూనిట్ కోసం కొనుగోలుదారులను వెతుకుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రకారం గుజరాత్ ప్లాంట్ కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ రిఫైనరీ కాంప్లెక్స్లలో ఒకటిగా ఉంటుంది. ఈ ప్లాంట్ రెండేళ్లలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. అగర్వాల్ కు చెందిన తమిళనాడు యూనిట్ 2018లో మూతపడటం వల్ల అది అందించే 40 శాతం రాగి తగ్గిపోవటం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నందున, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, కేబుల్లు అవసరాలకు రాగి వినియోగం భారీగా పెరిగింది. అందువల్ల అదానీ ఎంటర్ప్రైజెస్ ముంద్రాలో రాగి కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో రాగి వినియోగానికి సరిపడా ఉత్పత్తి లేనందున అదానీ గ్రూప్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఈ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన హిందాల్కో, ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కాపర్ సంస్థలు రాగి తయారీలో దిగ్గజాలుగా ఉన్నాయి. అదానీ రంగ ప్రవేశం చేస్తే ఈ రంగంలో మరింత పోటీ పెరగనుంది. రానున్న కాలంలో దేశీయ అవసరాలకు అనుగుణంగా కాపర్ తయారీ స్వదేశంలోనే పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది. దీని వల్ల క్లీన్ ఎనర్జీ, EV లపై భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మరింత దోహద పడనుంది.