కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా... లాభంలేదు! నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే
బ్యాంకుల ప్రయివేటైజేషన్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)తో కలిసి పని చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో బ్యాంకు ప్రయివేటీకరణ ప్రణాళికను ప్రకటించారు. తాజాగా ఇందుకు సంబంధించి ఆర్బీఐతో కలిసి పని చేస్తామని తెలిపారు.ఈ మేరకు నిర్మలమ్మ ముంబైలో విలేకరులతో మాట్లాడారు.
బ్యాంకుల ప్రయివేటీకరణకు సంబంధించిన అంశాలు సిద్ధమౌతున్నాయని, త్వరలో ప్రకటన చేస్తామన్నారు. రెండు బ్యాంకులను ప్రయివేటీకరిస్తామని ఇది వరకే ఆమె బడ్జెట్ పేర్కొన్నారు. అయితే, బ్యాంకులను అప్పగించే వ్యక్తుల వివరాలు తెలియజేసేందుకు నిరాకరించారు. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ARC) పేరిట ఏర్పాటయ్యే బ్యాడ్ బ్యాంకు పైన కూడా స్పందించారు. బ్యాంకుల నిరర్థక ఆస్తుల బదలీకి ఏర్పాటు చేయబోయే నేషనల్ ARCకి ప్రభుత్వం తరఫున కొంత హామీ ఉంటుందన్నారు.
బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నిర్మలమ్మ తెలిపారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రా సెస్ ద్వారా కేంద్రానికి రూ.30వేల కోట్లు సమకూరే అవకాశముందన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై నిర్మలమ్మ స్పందిస్తూ.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే ఆ మేరకు రాష్ట్రాలు పన్నులు పెంచుకొని, ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని, కేంద్రం తగ్గించడం వల్ల రేట్లలో మార్పు ఉండటం లేదన్నారు.