డిసెంబర్ 1 నుంచి కాదు.. ఫాస్టాగ్ గడువు 15 రోజులు పొడిగింపు
న్యూఢిల్లీ: నేషనల్ హైవేలపై ఉండే టోల్ ప్లాజాలలో వన్ లైన్లో మినహా మిగతా వాటిలో ఫాస్టాగ్ (fastag) ఉండే వాహనాలను మాత్రమే అనుమతించే కొత్త నిబంధనపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 15 రోజుల పొడిగింపు ఇచ్చింది. దీనిని డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే అందరిలో పూర్తిగా అవగాహన రాకపోవడంతో ఎక్కువ మంది దీనిని తీసుకోలేకపోయారు.
చాలామంది దీనిని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీకి బదులు డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలు నగదు చెల్లించి వెళ్లేందుకు కేవలం ఒక వరుసలో మాత్రమే అనుమతించేందుకు NHAI గతంలో ఆదేశాలిచ్చింది. ఇప్పుడు దీనిని పదిహేను రోజులు పొడిగించారు.
లూప్ లోకి వచ్చాకే: FASTag.. ప్రస్తుతానికి ఇబ్బందికరమేనా?
సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే జాతీయ రహదారుల వెంట ప్రయాణించాలి. వీటిపై వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఉండే టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. టోల్ చెల్లించడానికి ప్రతి వాహనం కొంత సమయం అక్కడ ఆగాల్సి ఉంటుంది. పండగలు, లేదా ఇతర సందర్భాల్లో ఎక్కువ వాహనాల రాకపోకలు జరగడం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతాయి.
పెద్ద నగరాలు, ఎక్కువ వాహనాలు వెళ్లే మార్గాల్లో ప్రతిరోజు టోల్ ప్లాజాల వద్ద వాహన రద్దీ పెరగడం వల్ల ప్రయాణికుల సమయం కూడా వృధా అవుతోంది. ఇది నిత్య కృత్యంగా మారిన నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అవరోధాలు లేకుండా సులభతరంగా టోల్ ను చెల్లించేందుకు ఫాస్టాగ్ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని నిలుపకుండానే టోల్ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇది వాహనదారులకు ఎంతో ప్రయోజనం.