గుడ్ న్యూస్: త్వరలోనే స్టార్టప్ కంపెనీలకు ప్రత్యేక కౌన్సిల్!
ఇన్నోవేటివ్ ఐడియాలతో, సరికొత్త పంథాలో వ్యాపారాలు నిర్వహించే స్టార్టుప్ కంపెనీలకు శుభవార్త. ఇండియాలో స్టార్టప్ కంపెనీలను మరింతగా ప్రోత్సహించేందుకు, వాటికి సరైన మద్దతు అందించేందుకు ప్రత్యేకంగా ఒక కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ కౌన్సిల్ లో ఎవరెవరు ఉండాలో, దాని విధివిధానాలు ఏమిటో ఇప్పటికే ఖరారు అయిపోయాయని వినికిడి. అన్నీ కుదిరితే వచ్చే బడ్జెట్ కంటే ముందే ఈ కౌన్సిల్ తొలి సమావేశం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టార్టుప్ కౌన్సిల్ లో ప్రభుత్వాధికారులు కూడా ఉంటారట. నియంత్రణ సంస్థల ఉన్నతాధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా స్టార్టుప్ కంపెనీలతో సంబంధం ఉండే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి అధికారులను సభ్యులుగా నియమిస్తే స్టార్టప్ సమస్యలు తీర్చేందుకు తగిన మార్గాలు అన్వేషించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
చైనా కంపెనీలతో పోటీలో వెనక్కి, శాంసంగ్లో ఉద్యోగాల కోత?
ఓలా, బైజూస్ ఫౌండర్లకు చోటు...
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న స్టార్టుప్ సలహా మండలి లో ఓలా క్యాబ్స్ ఫౌండర్ భవిష్ అగర్వాల్, ఎడ్యుటెక్ స్టార్టుప్ బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ లకు చోటు కల్పించనున్నారు. అలాగే ఇన్ఫోసిస్ కో ఫౌండర్లు నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణ సహా పలువురు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ ఇన్వెస్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటి) ఇటీవల గోవా లో నిర్వహించిన 2019 గ్లోబల్ వెంచర్ కాపిటల్ సమ్మిట్ సందర్భంగా ఇలాంటి కౌన్సిల్ ఒకటి ఉండాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. గోవా ప్రభుత్వం కూడా ఈ సమ్మిట్ కు నిర్వహణలో పాలుపంచుకుంది. బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ఈ కౌన్సిల్ తోలి సమావేశం జరగాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇదే విషయంపై భవిష్ వివరణ కోరగా.. అగర్వాల్, రవీంద్రన్, గోపాలకృష్ణన్, నీలేకని స్పందించ లేదని ఈటీ పేర్కొంది.
రూ 10,000 కోట్ల ఫండ్...
ఇండియా లో స్టార్టుప్ లను ప్రోత్సహించేందుకు, వాటికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం రూ 10,000 కోట్ల తో ఒక నిధిని ఏర్పాటు చేసింది. కానీ అనేక రకాల నిబంధనలు, అడ్డంకుల వల్ల అందులోనుంచి పెట్టుబడులు స్టార్టుప్ కంపెనీలకు చేరడం లేదు. స్టార్టుప్ ఇండియా విజన్ 2024 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నా... అమల్లో మాత్రం అవి పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదు. అందుకే అన్ని రకాల అడ్డంకులను తొలగించి, స్టార్టుప్ కంపెనీలు సులభంగా వ్యాపారం నిర్వహించుకునేందు అవసరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం స్టార్టుప్ సలహా మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పన్నులు, నియంత్రణల్లో స్పష్టత, వేగం పెంచే నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
పెన్షన్ ఫండ్ నిధులు...
దేశంలో స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ పెన్షన్ ఫండ్ సంస్థలు కూడా తమ వంతు సహాయం చేయాలనీ స్టార్టుప్ కంపెనీలు కోరుతున్నాయి. పెన్షన్ ఫండ్స్ మొత్తం నిర్వహణ నిధుల్లో నుంచి కనీసం 1% నిధులను కేవలం స్టార్టుప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఒక కార్పస్ ఫండ్ ని ఏర్పాటు చేయాలనీ కోరుతున్నాయి. ఇలాంటి అనేక విషయాల్లో తోడ్పాటును అందించేందుకు ప్రతిపాదిత స్టార్టుప్ అడ్వైసరి కౌన్సిల్ పనిచేయనుంది.