రుణమాఫీపై తెలంగాణ గుడ్న్యూస్, కరోనా టైంలో ఖర్చు ఇలా...
గత ఎన్నికల సమయంలో రూ.1 లక్ష లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే రూ.25వేల వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేశామన్నారు. కరోనా కారణంగా మిగతా రుణాల మాఫీలో ఆలస్యమైందని, త్వరలో ఇవి కూడా పూర్తవుతాయన్నారు.
హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం ఒక గంట ఏడు నిమిషాలు కొనసాగింది. రాష్ర్ట బడ్జెట్ను రూ.2,30,825 కోట్లుగా ప్రతిపాదించారు. 2020-21 బడ్జెట్ ప్రతిపాదలను ప్రభుత్వం రూ.1.82 లక్షల కోట్ల నుండి రూ.1.66 లక్షల కోట్లకు సవరించింది. 2020-21 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ బడ్జెట్లో రూ. 47,911 కోట్ల మేర ప్రతిపాదనలు పెరిగాయి. గత బడ్జెట్తో పోలిస్తే 26 శాతం ప్రతిపాదనలు పెరిగాయి. తెలంగాణ సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు, అటవీ శాఖకు రూ.1276 కోట్లు కేటాయించారు.
కరోనా నేపథ్యంలో ఆదాయంపై ప్రభావం పడటంతో పాటు కరోనా చర్యలకు కోట్లాది రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. ఐజోలేషన్ సెంటర్, మెడిసిన్స్, బెడ్స్, ఫుడ్ ఇతర అవసరాల కోసం రూ.1178 కోట్లు, రెండు నెలల పాటు రేషన్ కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేశామన్నారు. 6.47 లక్షల మంది వలసకార్మికులకు ఒక్కొక్కరికి రూ.500, 5 కిలోల బియ్యం ఇచ్చామని తెలిపారు. 2,01,213 మంది వలస కార్మికులను తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందుకు 151 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామన్నారు.