2014 తర్వాత మరోసారి మోడీ ప్రభుత్వం 'ఖర్చు నియంత్రణ' నిర్ణయం
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, జీఎస్టీ కలెక్షన్లు తగ్గుదల.. వంటి వివిధ కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాబడిపై దృష్టి సారించింది. డబ్బుల్లేని పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ పైన కొంత ఆశలు పెట్టుకుంది. తాత్కాలిక డివిడెండ్ అడగాలని భావిస్తోంది. అదే సమయంలో ఆయా శాఖల్లో ఖర్చులు తగ్గించే అంశంపై కూడా సూచనలు జారీ చేసింది. ప్రయాణ, ఆహార, సమావేశాలకు సంబంధించిన ఖర్చులు తగ్గించుకోవాలని సూచించింది.
తనిష్క్, కళ్యాణ్... 'గోల్డ్' లాంటి స్కీంలు, ఇవి మీకు తెలుసా?
ఆ ఖర్చులు 20 శాతం తగ్గించండి
ప్రయాణ, ఆహార, సమావేశాలకు సంబంధించిన ఖర్చులను 20 శాతం మేర తగ్గించాలని అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయని, ఈ విషయానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని CCIG డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ శాఖలను కోరినట్లుగా తెలుస్తోందని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఖర్చులు తగ్గించడంపై కేంద్రం దృష్టి సారించిందని చెబుతున్నారు.
మంత్రిత్వ శాఖలకు మినట్స్
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇటీవల కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ (CCIG) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖర్చుల తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. CCIG మినట్స్ను గత వారం ఆయా మంత్రిత్వ శాఖలకు పంపించారు. తద్వారా 2019-20 ఏడాదిలో బడ్జెట్ లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
2014లోనూ...
ఖర్చులను తగ్గించుకోవడం లేదా హేతుబద్దీకరించడం వంటి చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. ప్రణాళికేతర వ్యయాన్ని 10 శాతం తగ్గించాలని 2014 అక్టోబర్ నెలలో డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వివిధ విభాగాలను కోరింది. వాహనాల కొనుగోలు, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల ఖర్చులు తగ్గించుకోవాలని కూడా సూచించింది.