ysr matsyakara bharosa: మత్స్యకార భరోసా పథకం కింద రూ.231 కోట్లు విడుదల
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందున్న ఏపీ ప్రభుత్వం మంగళవారం మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసింది. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. సీఎం జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు.
ఈ పథకం కింద, ఫిషింగ్ ప్రయోజనం కోసం మోటరైజ్డ్ లేదా నాన్-మోటరైజ్డ్ ఫిషింగ్ వలలతో పనిచేసే మత్స్యకారులందరికీ ఆర్థిక సహాయం అందిస్తారు. వారికి వార్షికంగా రూ.10,000 సబ్సిడీ ఇస్తారు. లబ్ధిదారులకు లీటరుకు రూ.9 డీజిల్ సబ్సిడీతో అందజేస్తారు. గతంలో లీటరుకు రూ.6.03గా ఉంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 81 డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించింది. చేపల వేటలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచారు. 18, 60 ఏళ్లలోపు ఉన్న మత్స్యకారులకు ఇది వర్తిస్తుంది.
సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వేట నిషేధ భృతి కూడా జగన్ ప్రభుత్వం అందిస్తోంది. ఇలా సగటున 50 వేల మందికి రూ.21 కోట్ల మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు. ప్రభుత్వంపై తప్పుడు కథనాలతో బురద జల్లుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20 వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. గతంలో డీజిల్పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని జగన్ చెప్పారు.