taxable interest: ఇకపై రెండుగా పీఎఫ్ ఖాతాలు,
ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లోని మొత్తాల ద్వారా సమకూరే వడ్డీ పైన పన్ను విధించే దిశగా కేంద్రం పీఎఫ్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. బడ్జెట్లో పేర్కొన్నట్లుగా ఇకపై ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే వారికి పన్ను విధిస్తారు. అంటే ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్యోగులు తమ వాటాగా పీఎఫ్ ఖాతాలో జమ చేస్తే అదనంగా జమ చేసే మొత్తాలపై వచ్చే వడ్డీ మీద ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు రెండు వేర్వేరు ఖాతాలను ఏర్పాటు చేయాలని పేర్కొంటూ నిబంధనలను నోటిఫై చేసింది సీబీడీటీ. ఈ మేరకు నిబంధనలను మంగళవారం విడుదల చేసింది.
దీని ప్రకారం ప్రస్తుతమున్న ఈపీఎఫ్ ఖాతాలను రెండుగా విభజిస్తారు. ఒకటి పన్ను ఖాతా, మరొకటి పన్ను మినహాయింపు ఖాతా ఉంటాయి. 2021 మార్చి 31 నుండి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఏడాదికి రూ.2.5 లక్షలు కంటే ఎక్కువ మొత్తం పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తూ పన్ను మినహాయింపు పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ జమ అయ్యే మొత్తాలపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా తాజా నిబంధనలను నోటిఫై చేశారు. అయితే, రెండు ఖాతాల నిర్వహణ అనేది భారంతో కూడుకున్న వ్యవహారమనే వాదనలు ఉన్నాయి.