ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం కేంద్రం సరికొత్త పథకం
ఎయిర్ కండీషనర్స్, LED లైట్ రంగాలకు ఉత్పత్తి, అనుసంధాన ప్రోత్సాహక (PLI) స్కీంను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్ వెల్లడించారు.
ఏసీలు, LED లైట్ల తయారీలో నిమగ్నమైన సంస్థలకు అయిదేళ్ల కాలానికి దేశంలో తయారయ్యే వస్తువుల అమ్మకాలపై 4 శాతం నుండి 6 శాతం ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పథకం భారత్ అంతటా అమలు చేయనున్నారు. ఇది ఒక ప్రదేశం, ప్రాంతం లేదా విభాగానికి ప్రత్యేకంగా ఉండదు.
భారత్లో సౌరపరికరాల తయారీని పెంచేందుకు ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ పథకం దేశీయ తయారీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఈ పథకం కింద తయారీ సంస్థలకు ప్రోత్సాహకంగా రూ.4,500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, ఎలక్ట్రికల్ గృహోపకరణాలకు పీఎల్ఐ పథకాన్ని కేంద్రం ఆమోదించింది. విదేశాల నుండి 70 శాతం నుండి 80 శాతం వరకు ఎయిర్ కండీషనర్లు దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ పథకం ప్రకటించింది.