వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కి బిగ్ షాక్.. పర్యావరణానికి పెను ముప్పు కలిగిస్తోందంటూ కోర్టులో కేసు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి బాటలు వేస్తూ టెక్ దిగ్గజం గూగుల్.. దాదాపు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో ఒక భారీ డేటా సెంటర్ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భారత బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుని.. సుమారు 1,88,000 ఉద్యోగాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం కొండలను చదును చేసే పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు స్థానిక పర్యావరణానికి, వన్యప్రాణులకు తీవ్ర హాని కలిగిస్తుందనే ఆందోళనలతో పాటు.. తీవ్రమైన నీటి సంక్షోభానికి దారితీస్తుందన్న నెపంతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను, చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం 25 లక్షల జనాభా కలిగిన విశాఖపట్నం నగరానికి రోజువారీ నీటి అవసరం 48.0 కోట్ల లీటర్లు ఉండగా.. సరఫరా కేవలం 41.0 కోట్ల లీటర్లు మాత్రమే అందుతోంది. ఇప్పటికే నగరంలో నీటి రేషనింగ్ సాధారణంగా మారింది.

ఇటువంటి పరిస్థితుల్లో సర్వర్ల కూలింగ్ కోసం ప్రతిరోజూ మిలియన్ల లీటర్ల నీరు, విద్యుత్తు అవసరమయ్యే ఈ డేటా సెంటర్కు 20 ఏళ్ల పాటు 'హామీతో కూడిన' నీటి సరఫరా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించడం పట్ల స్థానిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము డేటాను తాగలేము అంటూ కార్యకర్తలు, చిన్నారులు ప్లకార్డులతో నిరసనలు తెలుపుతూ ఇంటింటి ప్రచారాలు, బీచ్ నిరసనలకు పిలుపునిచ్చారు. అభివృద్ధినేది ప్రజల జీవనోపాధిని, మౌలిక అవసరాలను దెబ్బతీసేలా ఉండకూడదని గ్రీన్ విశాఖ సంస్థ స్పష్టం చేసింది.
నీటి సమస్యలతో పాటు పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ అంశాలు కూడా ఈ ప్రాజెక్ట్ను చట్టపరమైన సవాలు ముందుకు నెట్టాయి. కేవలం 860 మీటర్ల దూరంలో ఉన్న కంబలకొండ వన్యప్రాణుల అభయారణ్యంపై భారీ నిర్మాణాలు, శబ్ద కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
జల్ బిరాదరి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు 24న విచారణకు హాజరు కావాలని కోరింది. అలాగే గ్రామీణ నీటి పథకాల ప్రభావాలను అంచనా వేయకుండా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారంటూ మానవ హక్కుల వేదిక (HRF) పర్యావరణ న్యాయస్థానంలో (NGT) మరో మూడు కేసులు దాఖలు చేసింది.
ఈ వివాదాలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పర్యావరణవేత్తల ఆందోళనలు అసంబద్ధమైనవని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని కొట్టిపారేసింది. ప్రైవేట్ ప్రాజెక్ట్ కోసం గ్రామీణ లేదా జలాశయ నీటిని ఉపయోగించబోమని.. అలాగే అభయారణ్యం పరిమితి చట్టపరమైన దూరంలోనే ఉందని తెలిపింది.
ఐతే ప్రజాస్వామ్యయుతంగా వచ్చే ప్రజాభిప్రాయాలను స్వీకరించి వాస్తవాల ఆధారంగా న్యాయమైన పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. మరోవైపు గూగుల్ సంస్థ సైతం స్పందిస్తూ.. తాము స్థానిక చట్టాలకు లోబడి పనిచేస్తామని, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు "అధునాతన ఎయిర్ కూలింగ్ టెక్నాలజీని" ఉపయోగిస్తూ పరిసర ప్రాంతాలకు ఇబ్బంది లేని శాంతియుత పొరుగువారిగా ఉంటామని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications
