దేశంలో ఇటీవల సంచలనం సృష్టించిన కేసుల్లో ఒకటి లోన్ యాప్స్. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు స్టూడెంట్స్ ను టార్గెట్ చేసి పెద్దఎత్తున జరిగిన మోసాలు గతంలో వెలుగుచూశాయి. చైనాకు చెందిన పలు కంపెనీలు ఈ యాప్స్ వెనుక ఉండి చట్ట విరుద్ధంగా పెద్ద మొత్తంలో వడ్డీల వసూళ్లకు పాల్పడ్డాయి. ఎట్టకేలకు ఈ కేసుకు ఆయా ప్రభుత్వాలు కొంతమేరకు కళ్లెం వేయగలిగాయి. దీనికి గూగుల్ సైతం సహకారం అందించింది.
టెక్ దిగ్గజం గూగుల్ 2022లో భారతదేశంలో 3 వేల 500 కంటే ఎక్కువ లోన్ యాప్లపై చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ఓ బ్లాగ్లో వెల్లడించింది. అదే ఏడాది 14 లక్షల 30 వేల యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో విడుదల కాకుండా నిరోధించింది. 200 మిలియన్ డాలర్ల కంటే విలువైన మోసం మరియు అనుమానాస్పద లావాదేవీలతో కూడిన లక్షా 73 వేల ఖాతాలను నిషేధించినట్లు అందులో పేర్కొంది.

గూగుల్ తన విధానాలను క్రమం తప్పకుండా సవరిస్తోందని, ప్రక్రియలను సమీక్షిస్తూ నిరంతర అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తుందని బ్లాగ్ లో పేర్కొంది. 2023లో ప్రకటనలు మరియు గోప్యతకు సంబంధించి కఠినమైన నియమాలను రూపొందిస్తున్నట్లు తెలిపింది. అయితే గతేడాది అక్టోబర్లో ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలకు సంబంధించిన పోటీ వ్యతిరేక పద్ధతులకు మరియు ప్లే స్టోర్ ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) టెక్ దిగ్గజంపై రెండు జరిమానాలు విధించింది. తన ప్రవర్తనను మార్చుకోవాలని కూడా ఆదేశించింది.
స్మార్ట్ మొబైల్ పరికరాల కోసం లైసెన్స్ పొందే ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS) మార్కెట్లలో మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ OS యాప్ స్టోర్ల మార్కెట్లో దేశంలో గూగుల్ ఆధిపత్యం చెలాయించినట్లు CCI తెలిపింది. యాప్ డెవలపర్లు తమ క్రియేషన్స్/ఇన్నోవేషన్లను మోనటైజ్ చేయడానికి.. యాప్ లో డిజిటల్ సేవలను విక్రయించడం ముఖ్య సాధనంగా ఉంటుందని కమిషన్ వెల్లడించింది. ప్లే స్టోర్ లో డిజిటల్ ఉత్పత్తుల అన్ని కొనుగోళ్లు లావాదేవీల ప్రాసెసింగ్ గూగుల్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications