గూగుల్ ఉద్యోగులు మూడ్రోజులు ఆఫీస్ నుండి, రెండ్రోజులు రిమోట్ వర్కింగ్
ప్రముఖ సెర్చింగ్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ వీక్ అనే సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పద్ధతిలో గూగుల్ ఉద్యోగులు వారంలో కేవలం మూడు రోజులు కార్యాలయానికి వస్తే సరిపోతుంది. మిగతా రెండు రోజులు రిమోట్ వర్క్ చేస్తే చాలు. ఈ మేరకు గూగుల్, అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. కరోనా తగ్గుముఖం పట్టి ఈ ఏడాది చివరి నాటికి గూగుల్ కార్యాలయాలను తిరిగి తెరిచినా 20 శాతం ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తారని, 60 శాతం మందికి హైబ్రిడ్ వర్క్ వీక్ పద్ధతిలో పని చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ ఏడాది మొదటి త్రైమాసిక గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థలో 1,40,000 వరకు పూర్తిస్థాయి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏ దేశంలో తమకు ఎంతమంది ఉద్యోగులున్నది వెల్లడించాల్సి ఉంది. ఒక్క భారత దేశంలోనే దాదాపు 4 వేలమంది ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువమంది బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్లో పని చేస్తున్నారు.
కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పరస్పరం కనిపించని వారంతా ఒకరినొకరు చూసుకుని కలిసి పని చేయగలుగుతామని సుందర్ పిచాయ్ అన్నారు. రిమోట్ ప్రాంతం నుండి పనిచేసే ఉద్యోగులు దాదాపు మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం వరకు ఉంటారని గూగుల్ అంచనా వేస్తోంది.