AI ప్రమాదకరంగా మారబోతోంది.. AGI రాక ముందే అప్రమత్తం కావాలి.. గూగుల్ డీప్మైండ్ CEO సంచలన వ్యాఖ్యలు..
ప్రపంచ సాంకేతిక రంగంలో ఐఏ సృష్టిస్తున్న విప్లవం అంతా ఇంతా కాదు.. అన్ని రంగాలు ఈ ఏఐ దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. మరి టెక్నాలజీ మారే కొద్ది కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఏఐ తరువాత ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. దీనికి గూగుల్ డీప్ మైండ్ సీఈఓ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కృత్రిమ మేధస్సు (AI) విభాగంలో అత్యంత శక్తివంతమైన రూపంగా భావించే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) రాబోయే కొన్నేళ్లలోనే అందుబాటులోకి రావచ్చునని నోబెల్ బహుమతి గ్రహీత డెమిస్ హస్సాబిస్ హెచ్చరించారు.
ఈ అధునాతన సాంకేతికత మానవ నియంత్రణను, ప్రస్తుత భద్రతా చర్యలను అధిగమించక ముందే.. ప్రభుత్వాలు, ఐటీ పరిశ్రమ త్వరితగతిన కఠినమైన నియంత్రణలను తీసుకురావాలని ఆయన కోరారు. తన కొత్త వ్యక్తిగత బ్లాగ్లో హస్సాబిస్ ఈ విషయాలను పంచుకుంటూ.. ఏజీఐ అనేది కేవలం మూడు నుండి నాలుగు సంవత్సరాల దూరంలోనే ఉందనే తన మునుపటి అంచనాను మరోసారి స్పష్టం చేశారు. ఆయన ఏజీఐని మానవ మెదడుకు ఉండే అన్ని రకాల Cognitive సామర్థ్యాలను ప్రదర్శించే వ్యవస్థగా నిర్వచించారు. అయితే ఏఐ పరిశోధనా వర్గాల్లో.. మానవ-స్థాయి ఏఐ ఇంత త్వరగా వస్తుందనే దానికి ఎలాంటి ఏకాభిప్రాయం గానీ, స్పష్టమైన ఆధారాలు గానీ లేకపోవడంతో ఈ అంచనా ఇప్పటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది.

ప్రస్తుతం టెక్నాలజీ కంపెనీలు, ప్రభుత్వాలు కేవలం శక్తివంతమైన ఏఐ నమూనాలను నిర్మించే పోటీపైనే శ్రద్ధ పెడుతున్నాయని, కానీ వాటి వల్ల రాబోయే నష్టాలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నాయని హస్సాబిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత అత్యాధునిక ఏఐ వ్యవస్థలే ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ సవాళ్లను సృష్టిస్తున్నాయని.. భవిష్యత్ తరాల ఏఐ మరింత స్వయంప్రతిపత్తిని సాధిస్తే అవి జీవ, అణు భద్రతకు పెద్ద ముప్పుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు.
ముఖ్యంగా మానవ ప్రమేయం లేకుండా తమను తాము మెరుగుపరుచుకోగల ఏఐ నమూనాలపై పట్టు సాధించడానికి పరిశోధకులకు పటిష్టమైన యంత్రాంగాలు అవసరమవుతాయి. ఈ రకమైన ఆందోళనలను ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్, దాని సీఈఓ డారియో అమోడెయ్ కూడా సమర్థిస్తున్నారు. ప్రస్తుత ఏఐ నమూనాలు తమ నిర్ణయాలను ఎలా తీసుకుంటున్నాయో పరిశోధకులకు కూడా ఇంకా పూర్తిగా అర్థం కాలేదని.. కాబట్టి పటిష్టమైన భద్రతా పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని వారు అంగీకరిస్తున్నారు.
ఏజీఐ వాస్తవరూపం దాల్చక ముందే ఈ సాంకేతిక సవాళ్లను అధిగమించవచ్చనే నమ్మకాన్ని హస్సాబిస్ వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా అమెరికాలోని ఫైనాన్షియల్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ అథారిటీ (FINRA) తరహాలో ఏఐ రంగాన్ని నియంత్రించడానికి ఒక ప్రైవేట్ పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత నియంత్రణ సంస్థ ప్రముఖ సాంకేతిక నిపుణులను ఒకచోట చేర్చి, ప్రధానంగా ఏఐ పరిశ్రమ నుండి వచ్చే నిధులతోనే నడుస్తుంది.
అలాగే అత్యాధునిక ఏఐ నమూనాలను మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు అవి తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ప్రారంభంలో డెవలపర్లు తమ నమూనాలను విడుదలకు 30 రోజుల ముందే స్వచ్ఛందంగా పరీక్షల కోసం సమర్పించేలా చేసి.. ఆ పరీక్షా విధానాలు స్థిరపడిన తర్వాత దీనిని అందరికీ తప్పనిసరి చేయాలని సూచించారు. సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికా.. అంతర్జాతీయంగా ఆమోదించబడిన ఏఐ ప్రమాణాలను నెలకొల్పడానికి ఈ చట్రాన్ని ప్రారంభించడానికి సరైన స్థితిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
హస్సాబిస్ హెచ్చరికల్లో ఎక్కువ భాగం ప్రమాదాల గురించే ఉన్నప్పటికీ.. ఏజీఐని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేస్తే అది మానవాళికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సాంకేతికత శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయగలదని, ఔషధాల పరిశోధన ద్వారా ఆరోగ్య రంగాన్ని మార్చగలదని, స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన పదార్థాల సృష్టిలో తోడ్పడి మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను పరిష్కరిస్తుందని అన్నారు.
ఏజీఐని కేవలం మరో కంప్యూటింగ్ మైలురాయిగా చూడలేమని.. దీనిని విద్యుత్తు లేదా అగ్నిని కనుగొనడంతో పోల్చవచ్చని ఆయన పేర్కొన్నారు. మనం సిలికాన్ చిప్స్ ఆలోచింపజేసే మార్గాన్ని కనుగొన్నామని.. ఇది ఒక అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఇంకా నిర్ణయించబడలేదని.. రాబోయే కొన్నేళ్లలో ప్రభుత్వాలు, సంస్థలు తీసుకునే నిర్ణయాలే మానవ నాగరికత యొక్క తదుపరి దశను ఏఐ ఎలా తీర్చిదిద్దుతుందో నిర్ణయిస్తాయని హస్సాబిస్ తెలిపారు.


Click it and Unblock the Notifications
