హెచ్1బీ వీసా బ్యాన్, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం విస్మయం కలిగించింది: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
కరోనా వైరస్ వల్ల అమెరికా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ వీసాను డిసెంబర్ వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం విస్మయానికి గురిచేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అయితే గూగుల్ మాత్రం వలసదారుల పట్ల సానుకూలంగా ఉంటుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. వాస్తవానికి వసలదారుల వల్లే అమెరికా ఆర్థిక ప్రగతి మరింత ఉన్నతస్థితికి చేరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గూగుల్ను గ్లోబల్ కంపెనీగా మార్చడంలో వలస ఉద్యోగులు దోహదపడ్డారని గుర్తుచేశారు.
అలా చేస్తే పక్షపాతమే: అంగీకరించిన సుందర్ పిచాయ్, గూగుల్ కీలక నిర్ణయం
హెచ్1బీ, హెచ్2బీ, ఎల్, జే వీసాలను నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన వెంటనే సుందర్ పిచాయ్ స్పందించారు. ట్రంప్ ప్రకటన తనను నిరాశకు గురిచేసిందని ట్వీట్ చేశారు. కానీ అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థ పతనంతో.. స్వదేశీ నినాదంతో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే హెచ్1బీ వీసాతో అమెరికాలో ఉన్నవారికి నిబంధన వర్తించదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టంచేశాయి. వాస్తవానికి హెచ్1బీ వీసా ద్వారా గూగుల్, మెక్రోసాప్ట్, టీసీఎస్, ఇన్పోసిస్, విప్రో కంపెనీలకు చెందిన టెకీలు అమెరికాలో కొలువు చేస్తుంటారు. కానీ అమెరికా తాజా నిర్ణయంతో ఉద్యోగుల బదిలీకి కూడా అవకాశం లేకుండా పోయింది.
హెచ్1బీ వీసా రద్దు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని నాస్కామ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం అమెరికా నుంచి తిరిగొచ్చిన ఉద్యోగులపై ప్రభావం చూపిస్తోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. హెచ్1బీ వీసా రద్దు కొనసాగితే సెప్టెంబర్ మాసం తర్వాత కొత్త వీసా ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగాల క్రమంగా పడిపోతున్నాయని కూడా చెప్పారు. హెచ్1బీ వీసా ద్వారా అమెరికాలో ఉన్న భారతీయులు 0.05 శాతం మాత్రమే ఉంటారని తెలిపారు. 7 భారతీయ కంపెనీలు మాత్రమే హెచ్1బీ వీసా ఇచ్చి.. అమెరికా పంపిస్తున్నాయని చెప్పారు.