ముంచుకొస్తున్న భారీ ఆహార సరఫరా సంక్షోభం ముప్పు .. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన గోల్డ్మన్ సాచ్స్..
ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు 'గోల్డ్మన్ సాక్స్' తన తాజా నివేదికలో ఆగ్నేయాసియా (Southeast Asia) దేశాలకు సంబంధించి ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని పలు దేశాలలో ఆహార సరఫరాపై ఒత్తిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని.. ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని (Food Inflation) తీవ్రస్థాయికి తీసుకెళ్లవచ్చని పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల వల్ల పెరిగిన ఇంధన ఖర్చులు, రాబోయే వినాశకర వాతావరణ పరిస్థితులు ఒకేసారి ఢీకొట్టడమే ఈ ముప్పునకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఈ నివేదిక ప్రకారం.. 2026 చివరి నాటికి పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత బలమైన 'ఎల్ నినో' (El Niño) వాతావరణ సరళి ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనాల ప్రకారం.. 2026 జూన్, ఆగస్టు నెలల మధ్య ఎల్ నినో సంభవించే సంభావ్యత 80 శాతంగా ఉండగా, నవంబర్ నాటికి ఇది 90 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి వల్ల సాధారణ వర్షపాత వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన కరువు, మరికొన్ని ప్రాంతాలలో అకాల భారీ వర్షాలు కురుస్తాయి. దీనివల్ల ఆగ్నేయాసియాలో అత్యంత కీలకమైన వరి (బియ్యం), కూరగాయలు , ఇతర ప్రధాన పంటల దిగుబడి నేరుగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

వాతావరణ మార్పులకు తోడు, పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం)లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. ఈ ఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పాటు, రసాయన ఎరువుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ రంగానికి, ఆహార రవాణాకు ఇంధనమే కేంద్ర బిందువు కావడంతో, పెరిగిన చమురు ధరలు వినియోగదారుల ధరల సూచీపై (CPI) తక్షణ ప్రభావం చూపుతున్నాయి. ఎరువుల కొరత, అధిక ధరల వల్ల రైతుల పెట్టుబడి వ్యయం భారంగా మారుతోంది. ఈ ఉమ్మడి ఒత్తిళ్ల కారణంగా ఆరు నెలల తర్వాత ప్రాంతీయ ఆహార ద్రవ్యోల్బణానికి సగటున 1 శాతం పాయింట్ అదనంగా చేరుతుందని, ఏడాది ముగిసేసరికి అది 2.1 పాయింట్లకు పెరిగి, ఆ తర్వాతే తగ్గుముఖం పట్టవచ్చని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది.
ఈ ఆహార సంక్షోభ ప్రమాదం ఆగ్నేయాసియాలోని అన్ని దేశాలపై ఒకేలా ఉండదు. తమ సొంత అవసరాల కోసం దిగుమతి చేసుకునే ఆహార సరఫరాలపై ఎక్కువగా ఆధారపడే సింగపూర్ , ఫిలిప్పీన్స్ దేశాలు ఈ అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులకు అత్యంత సులభంగా ప్రభావితమవుతాయని నివేదిక పేర్కొంది. పామాయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున మలేషియా, ఇండోనేషియా దేశాలకు కొంతవరకు రక్షణ ఉన్నప్పటికీ, పామాయిల్ రంగాన్ని మినహాయిస్తే ఈ రెండు దేశాలు కూడా నికర ఆహార దిగుమతిదారులుగానే మిగిలిపోతాయి. మరోవైపు, థాయిలాండ్ దేశం తన వ్యవసాయానికి అవసరమైన ఎరువులలో 90 శాతానికి పైగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది, కాబట్టి అధిక ఉత్పాదక వ్యయం కారణంగా ఆ దేశం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఈ ప్రతికూల పరిస్థితుల ప్రభావం కేవలం ఆగ్నేయాసియాకే పరిమితం కాకుండా భారతదేశంపై కూడా పడే అవకాశం ఉంది. భారత్లో బలహీనమైన రుతుపవన వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటే, అది దేశీయ అవసరాలకే కాకుండా అంతర్జాతీయంగా చక్కెర , బియ్యం ఎగుమతులపై ప్రభావం చూపవచ్చు. అయితే, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ఆర్థికవేత్తల ప్రకారం, ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బియ్యం, ఇతర ధాన్యాల నిల్వలు , ముందస్తు పంటలు ఈ దెబ్బ తీవ్రతను కొంతవరకు తగ్గించగలవనే సానుకూల అంచనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ప్రాంతీయ ప్రభుత్వాలు ఆహార భద్రత , ఇంధన ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
