గరిష్టాల నుండి పడిపోతున్న బంగారం, వెండి.. ఇన్వెస్టర్లు ఇప్పుడు చేయాల్సిన 3 పనులు ఇవే!
గత కొన్ని నెలలుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అస్సలు తగ్గవనే రేంజ్లో దూసుకుపోయాయి. దాదాపు ప్రతి వారం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత వంటి కారణాలతో జనాలు కూడా సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు పరుగులు తీశారు. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. గత కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. ఆల్టైమ్ హైస్ నుండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో గురువారం కూడా పసిడి, వెండి ధరలు నష్టాలతోనే ట్రేడ్ అయ్యాయి. అసలు ఈ భారీ ర్యాలీకి బ్రేక్ పడటానికి కారణాలేంటి? ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణలో చూద్దాం.

ధరలు పడిపోవడానికి 3 ముఖ్య కారణాలు
- లాభాల స్వీకరణ (Profit Booking): గత ఏడాది కాలంలో బంగారం, వెండి ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ ఇచ్చాయి. దాంతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ లాభాలను లాక్ చేసుకోవడానికి (అమ్ముకోవడానికి) మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ విపరీతంగా పెరిగినప్పుడు ఇలాంటి కరెక్షన్ రావడం సహజం.
- బలపడిన యూఎస్ డాలర్: సాధారణంగా డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల వల్ల ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడంతో పసిడిపై ఒత్తిడి పెరిగింది. ఇతర కరెన్సీలు వాడే వారికి దీనివల్ల బంగారం కొనడం కాస్ట్లీగా మారుతుంది.
- మండిపోతున్న క్రూడాయిల్ ధరలు: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు బ్యారెల్కు 91 నుండి 93 డాలర్ల శ్రేణిలో ఉన్నాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది భారత్ లాంటి దేశాల దిగుమతి ఖర్చులను పెంచి, మార్కెట్లలో ఒక రకమైన అస్థిరతను సృష్టిస్తుంది. అందుకే ట్రేడర్లు ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
టెక్నికల్ చార్ట్స్ ఏం చెబుతున్నాయి?
ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ విశ్లేషణ ప్రకారం.. బంగారం ఒక ముఖ్యమైన మైలురాయి కంటే కిందకు పడిపోవడంతో మార్కెట్ కాస్త నెగెటివ్గా కనిపిస్తోంది.
- బంగారం (MCX Gold): ఎంసీఎక్స్లో బంగారం కీలకమైన రూ.1,50,000 సైకలాజికల్ మార్క్ కంటే కిందకు పడిపోయింది. సెంటిమెంట్ మళ్లీ పాజిటివ్గా మారాలంటే ధర రూ.1,50,000 దాటాలి. అలా జరిగితే మళ్లీ రూ.1,54,000 - రూ.1,55,000 వరకు వెళ్లవచ్చు. ఒకవేళ రూ.1,46,000 కంటే కిందకు పడిపోతే, అమ్మకాల ఒత్తిడి పెరిగి రూ.1,45,000 - రూ.1,43,000 శ్రేణికి పడిపోయే ప్రమాదం ఉంది.
- వెండి (MCX Silver): వెండి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. ప్రస్తుతం రూ.2,30,000 మార్క్ దగ్గర సపోర్ట్ అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. మార్కెట్ పుంజుకోవాలంటే రూ.2,36,000 పైన స్థిరపడాలి, అప్పుడు రూ.2,40,000 , రూ.2,43,000 వరకు చేరవచ్చు. ఒకవేళ రూ.2,30,000 బ్రేక్ అయితే మాత్రం రూ.2,28,000 - రూ.2,25,000 కి పడిపోవచ్చు.
ఇన్వెస్టర్లు ఇప్పుడు చేయాల్సిన 3 పనులు
మార్కెట్ పడుతున్న సమయంలో కంగారు పడకుండా ఈ క్రింది వ్యూహాలను పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు..
- కంగారుపడి అమ్మేయకండి (Avoid Panic Selling): పెద్ద ర్యాలీ తర్వాత చిన్నపాటి తగ్గుదలలు సహజం. కేవలం రోజువారీ ధరల హెచ్చుతగ్గులను చూసి భయపడి ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోకండి.
- పోర్ట్ఫోలియోను రివ్యూ చేయండి (Asset Allocation): గత కొన్ని నెలల లాభాల వల్ల మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో Gold వాటా బాగా పెరిగి ఉంటే.. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా దానిని రీబ్యాలెన్స్ (మరో అసెట్ క్లాస్లోకి మార్చడం) చేసుకోవడం మంచిది.
- విడతల వారీగా ఇన్వెస్ట్ చేయండి (Staggered Buying): లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇదొక మంచి అవకాశం. మార్కెట్ బాటమ్ (అత్యంత తక్కువ ధర) ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ధరలు తగ్గినప్పుడల్లా సిస్టమాటిక్గా (SIP పద్ధతిలో) కొద్దికొద్దిగా కొనుగోలు చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది.
ఈ ఏడాది ప్రారంభంలో చూసిన రికార్డు స్థాయి పరుగుతో పోలిస్తే ఈ ప్రస్తుత తగ్గుదల ఆందోళన కలిగించవచ్చు. కానీ, ఇది కేవలం తాత్కాలిక ఒడిదుడుకు మాత్రమే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు రోజువారీ రేట్లను పట్టించుకోకుండా, తమ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని నమ్ముకుని ముందుకు సాగడం ఉత్తమం.


Click it and Unblock the Notifications