బంగారం వద్దు బాబోయ్ అంటున్న ఇన్వెప్టర్లు.. మొత్తం అమ్మేసి మనీ మార్కెట్లో భారీగా పెట్టుబడులు.. కారణం ఏంటంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్, బంగారం తదితర రంగాలు పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన లాభాలను పంచినప్పటికీ.. మార్కెట్ వర్గాల ప్రాధాన్యతలు మాత్రం పూర్తిగా తలకిందులయ్యాయి. సాధారణంగా అధిక రాబడులు ఇచ్చే రంగాల్లోకి ఎక్కువ నిధులు వస్తుంటాయి. అయితే ఆచరణలో మాత్రం పెట్టుబడిదారులు అధిక రాబడుల కంటే.. తమ అసలు నిధుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తాజా నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.
ఆస్తుల నిర్వహణ సంస్థ వాలమ్ క్యాపిటల్ ఇటీవల విడుదల చేసిన ఆగష్టు 2026 మంత్లీ మాక్రో గ్రిడ్ చార్ట్బుక్ నివేదిక ప్రకారం.. మార్కెట్లో పలు విభాగాలు అద్భుతమైన లాభాలను నమోదు చేసినప్పటికీ, మెజారిటీ పెట్టుబడిదారులు సురక్షితమైనదిగా భావించే మనీ మార్కెట్, లార్జ్-క్యాప్ ఫండ్లలోకే తమ నిధులను భారీగా మళ్లించారు. జూలై నెలకు సంబంధించిన నిధుల ప్రవాహ గణాంకాలు మార్కెట్ ర్యాలీ వెనుక ఉన్న పెట్టుబడిదారుల తీవ్రమైన అప్రమత్తతను బహిర్గతం చేస్తున్నాయి.

గత నెలలో Gold, కమోడిటీ వర్గాలు ఊహించని స్థాయిలో రాబడులను అందించాయి. అంతర్జాతీయంగా అమెరికా ఉపాధి గణాంకాలు నిరాశాజనకంగా వెలువడటంతో.. అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తక్షణమే పెంచకపోవచ్చనే అంచనాలు బలపడ్డాయి. ఇది బంగారానికి అనుకూలంగా మారి, కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఏకంగా 9 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో మొత్తం ఈక్విటీ మార్కెట్ కేవలం 1.8 శాతం రాబడిని మాత్రమే ఇవ్వడం గమనార్హం. అంటే బంగారం స్టాక్ మార్కెట్ కంటే ఐదు రెట్లు ఎక్కువ పనితీరును కనబరిచింది.
దీనికి తోడు అంతర్జాతీయంగా పసిడి గనుల తవ్వకం కంపెనీల షేర్లు కూడా ఏకంగా 21 శాతం రాబడిని ఇచ్చాయి. అయితే విచిత్రంగా ఈ రికార్డు స్థాయి రాబడులు ఉన్నప్పటికీ బంగారం, విలువైన లోహాల ఫండ్లలోకి నిధుల ప్రవాహం గణనీయంగా తగ్గింది. జూన్ నెలలో విలువైన లోహాల ఫండ్లకు రూ. 8,680 కోట్ల నిధులు రాగా.. జూలై నాటికి ఆ ప్రవాహం రూ. 4,084 కోట్లకు పడిపోయింది. బంగారంలో సంపాదించిన లాభాలను మళ్లీ అందులోనే పెట్టుబడి పెట్టకుండా ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకుని వేరే సురక్షిత మార్గాలకు మళ్లించారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇలా ఇతర రంగాల నుండి ఉపసంహరించుకున్న నిధులన్నీ మనీ మార్కెట్ ఫండ్లలోకి విపరీతంగా పోటెత్తాయి. జూన్ నెలలో మనీ మార్కెట్ ఫండ్ల నుండి రూ. 65,530 కోట్ల నిధులు బయటకు వెళ్లగా, జూలై నాటికి పరిస్థితి ఊహించని విధంగా మారిపోయింది. ఏకంగా ఒకే నెలలో రూ. 1,40,390 కోట్ల కొత్త పెట్టుబడులు మనీ మార్కెట్ ఫండ్లలోకి వచ్చి చేరాయి.
అంటే ఒక్క నెల వ్యవధిలోనే నికర నిధుల ప్రవాహంలో రూ. 2,05,920 కోట్ల భారీ వ్యత్యాసం నమోదైంది. మనీ మార్కెట్ ఫండ్లు కేవలం 0.5 శాతం అత్యల్ప రాబడిని మాత్రమే అందించినప్పటికీ.. ఇన్వెస్టర్లు తమ భద్రత కోసమే ఈ విభాగానికి ఓటు వేశారు. ప్రస్తుతం మనీ మార్కెట్ ఫండ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 11,57,618 కోట్లకు చేరుకోవడం వారి సురక్షితమైన ఆలోచనా ధోరణికి అద్దం పడుతోంది.
ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్ల విషయంలోనూ ఇదే విధమైన ట్రెండ్ పునరావృతమైంది. జూన్లో రూ. 53,006 కోట్ల నిష్క్రమణలను చూసిన ఈ విభాగం, జూలైలో రూ. 5,947 కోట్ల నికర పెట్టుబడులను ఆకర్షించింది. ఇక్కడ కూడా లభించిన రాబడి కేవలం 0.6 శాతమే కావడం విశేషం. మరోవైపు, దేశీయ రంగాలు, స్టాక్ మార్కెట్ విభాగాలను పరిశీలిస్తే, జూలై నెలలో దాదాపు నాలుగు లక్షల ప్రయాణీకుల వాహనాల విక్రయాలు నమోదు కావడంతో ఆటో మరియు రవాణా రంగాలు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. ఆటో రంగం ఒక నెలలో 10.3 శాతం రాబడిని ఇవ్వగా, రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాలు 9.2 శాతం రాబడిని ఇచ్చాయి.
గ్లోబల్ ఇన్వెస్టర్లు దక్షిణ కొరియా సెమీకండక్టర్ కంపెనీల నుండి నిధులను ఉపసంహరించి భారతీయ సాఫ్ట్వేర్ రంగానికి మళ్లించడంతో టెక్నాలజీ ఫండ్లు 8.3 శాతం రాబడిని సాధించాయి. అయితే, టెక్నాలజీ ఫండ్ల నుండి కూడా రూ. 1,345 కోట్ల నిధులు ఉపసంహరణకు గురయ్యాయి. హెల్త్కేర్ విభాగం 16.4 శాతం ఏడాదినోటి రాబడితో రూ. 737 కోట్ల కొత్త పెట్టుబడులను పొందింది. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు 3.8 శాతం లాభపడగా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు 4 శాతం క్షీణించాయి. గతంలో భారీ వెలుగు వెలిగిన రైల్వేస్, ఇంధన, పబ్లిక్ సెక్టార్ రంగాలు ఈసారి దాదాపు శూన్య రాబడులను ఇచ్చి మందకొడిగా సాగాయి.
చిన్న, మల్టీ-క్యాప్ విభాగాలలో చూస్తే మైక్రో-క్యాప్ ఫండ్లు నెలలో 4.6 శాతం రాబడితో అగ్రస్థానంలో నిలిచాయి. స్మాల్-క్యాప్ ఫండ్లు 2.8 శాతం రాబడిని ఇస్తూ రూ. 5,353 కోట్ల నిధులను ఆకర్షించాయి. అయితే, ఈ మొత్తం డేటాలోనే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం లార్జ్-క్యాప్ ఫండ్ల పనితీరులోనే కనిపించింది.
లార్జ్-క్యాప్ విభాగం జూలై నెలలో కేవలం 0.7 శాతం రాబడిని మాత్రమే ఇచ్చింది, పైగా ఈ సంవత్సరం ప్రారంభం నుండి దీని రాబడి మైనస్ 3.9 శాతంగా ప్రతికూలంగా ఉండిపోయింది. అయినప్పటికీ, జూలై నెలలో ఇన్వెస్టర్లు రూ. 14,977 కోట్లను లార్జ్-క్యాప్ ఫండ్లలోకి పంపించారు. ఇది జూన్ నెలతో పోలిస్తే రూ. 5,291 కోట్లు అధికం. అత్యంత బలహీనమైన రాబడులు ఇస్తున్నప్పటికీ.. పెద్ద కంపెనీలలో స్థిరత్వం, భద్రత ఉంటుందనే నమ్మకంతో ఇన్వెస్టర్లు ఇక్కడే ఎక్కువ డబ్బును దాచుకోవడానికి ఇష్టపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ విషయానికొస్తే సెమీకండక్టర్ రంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. చైనా సెమీకండక్టర్ ఈటీఎఫ్ నెలలో 24 శాతం లాభపడగా.. దక్షిణ కొరియా సెమీకండక్టర్ ఈటీఎఫ్ ఏకంగా 31 శాతం పడిపోయి రెండింటి మధ్య 55 శాతం వ్యత్యాసాన్ని చూపింది. ఇది ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంభవిస్తున్న భౌగోళిక మార్పులను సూచిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ప్రస్తుత మార్కెట్లో లాభాల ర్యాలీలు, సంపాదన అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం గుడ్డిగా రిస్క్ తీసుకోకుండా అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. వేగంగా పెరిగే రంగాల నుండి లాభాలను స్వీకరిస్తూ.. తమ వద్ద ఉన్న మిగిలిన నిధులను మనీ మార్కెట్, లార్జ్-క్యాప్ వంటి సురక్షితమైన ప్రదేశాలలో భద్రపరుచుకుంటూ మార్కెట్లో ముందుకు సాగుతున్నారు.


Click it and Unblock the Notifications
