టన్నుల కొద్దీ బంగారం రాత్రికి రాత్రే అమెరికా నుండి తరలించిన పలు దేశాలు.. కారణం ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ (DNB) తమ బంగారు నిల్వలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని న్యూయార్క్, కెనడాలోని ఒట్టావాలో భద్రపరిచిన తమ 86 టన్నుల పసిడి నిల్వలను యూకేలోని లండన్కు విజయవంతంగా తరలించింది.
మార్చి, ఆగస్టు 2026 మధ్య కాలంలో అత్యంత రహస్యంగా సాగిన ఈ ప్రక్రియ.. 2014 తర్వాత నెదర్లాండ్స్ చేపట్టిన అతిపెద్ద gold నిల్వల మార్పిడిగా నిలిచింది. గతంలో నవంబర్ 2014లో న్యూయార్క్ నుంచి 122.5 టన్నుల బంగారాన్ని ఆమ్స్టర్డామ్కు తరలించిన డచ్ బ్యాంక్.. ఇప్పుడు అమెరికా, కెనడాల్లో ఉన్న తమ పసిడిలో నాలుగో వంతు కంటే ఎక్కువ భాగాన్ని లండన్కు మార్చడం గమనార్హం.

ఈ తరలింపుపై మార్కెట్లో వస్తున్న ఊహాగానాలకు డచ్ సెంట్రల్ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. తాము బంగారాన్ని విక్రయించలేదని.. కేవలం దాని భద్రతా లాకర్ ప్రదేశాన్ని మాత్రమే మార్చామని స్పష్టం చేసింది. ఈ పసిడిపై సంపూర్ణ యాజమాన్య హక్కులు నెదర్లాండ్స్ వద్దే ఉంటాయని, లండన్లోని 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్' వద్ద దీనిని భద్రపరిచినట్లు తెలిపింది.
సొంత దేశానికి కాకుండా లండన్కు ఎందుకు తరలించారనే ప్రశ్నకు 'లిక్విడిటీ' (ద్రవ్యత), 'ట్రేడబిలిటీ' (వ్యాపారయోగ్యత) ప్రధాన కారణాలని వివరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బులియన్ వాణిజ్య కేంద్రమైన లండన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉండే gold కడ్డీలు అంతర్జాతీయ వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితి లేదా ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఈ బంగారాన్ని తక్షణమే విక్రయించి డాలర్లు, పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలను సమీకరించుకోవడం లేదా అంతర్జాతీయ చెల్లింపులకు ఉపయోగించడం అత్యంత సులువవుతుంది. న్యూయార్క్, ఒట్టావాలలోని పసిడి సురక్షితమైనదే అయినప్పటికీ, తక్షణ లభ్యత పరంగా లండన్ మార్కెట్ అత్యుత్తమమైనదని బ్యాంక్ పేర్కొంది.
ఈ చర్యను అమెరికాపై విశ్వాసం తగ్గడంగా భావించలేమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రపంచ చమురు సరఫరాకు విఘాతం కలిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు డచ్ బ్యాంక్ గవర్నర్ ఓలాఫ్ స్లిప్పెన్ ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ బదిలీ తర్వాత డచ్ సెంట్రల్ బ్యాంక్ యొక్క మొత్తం పసిడి నిల్వల్లో 32.1% లండన్ వద్ద, 30.8% నెదర్లాండ్స్లోని జైస్ట్ క్యాష్ సెంటర్లో రెండు కలిపి 18.5% న్యూయార్క్, ఒట్టావాలలో భద్రపరచబడ్డాయి. భౌగోళిక వైవిధ్యీకరణ (Geographical Diversification) ద్వారా ఏదైనా ఒక ప్రాంతంలో సమస్య వస్తే మొత్తం నిల్వలు చిక్కుకుపోకుండా డచ్ బ్యాంక్ జాగ్రత్తపడింది. కాగా గతేడాది జులై 2025 నుండి జనవరి 2026 మధ్య కాలంలో ఫ్రాన్స్ సెంట్రల్ బ్యాంక్ కూడా న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ నుండి 129 టన్నుల బంగారాన్ని ఉపసంహరించుకోవడం గమనార్హం.
కేంద్ర బ్యాంకులు పసిడిని ఒక అత్యవసర భద్రతా వలయంగా పరిగణిస్తుండటంతో గత 12 నెలల్లో అంతర్జాతీయంగా బంగారం ధర ఏకంగా 25 శాతం పెరిగి ఔన్సుకు $4,429.61 మార్కుకు చేరింది. అయితే, సెంట్రల్ బ్యాంకుల నిల్వల మార్పిడి వార్తల ఆధారంగా చిల్లర ఇన్వెస్టర్లు ఒకేసారి గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ధరలు భారీగా పెరిగినందున మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉందని, వడ్డీ రేట్లు మరియు డాలర్ బలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

