Akshaya Tritiya: పదేళ్ల పసిడి రేట్ల ప్రస్థానం ఇలా: పడుతూ లేస్తూ..స్థిరంగా:
హైదరాబాద్: దేశవ్యాప్తంగా బంగారం, వెండి రేట్లల్లో స్థిరత్వం నెలకొంది. శనివారం వాటి ధరల్లో పెరుగుదల గానీ, తగ్గుదల గానీ చోటు చేసుకోలేదు. బంగారం, వెండి ధరల్లో కొద్దిరోజులుగా నెలకొన్న అప్ అండ్ డౌన్స్కు బ్రేక్ పడింది. సాధారణంగా వీకెండ్లోనూ వాటి ధరల్లో కొద్దో, గొప్పో కదలికలు కనిపిస్తుంటాయి. ఈ వారాంతం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరల్లో స్థిరత్వం నెలకొంది. 10 గ్రాముల బంగారం ధర 48,710 రూపాయల వద్ద నిలిచింది.
బెంగళూరులో 22 గ్రాముల బంగారం ధర 44,650, 24 క్యారెట్లు 48,710 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర 44,500 24 క్యారెట్లు 48,560 వద్ద నిలిచింది. విశాఖపట్నం, విజయవాడల్లో ఇవే రేట్లు పలుకుతున్నాయి. వెండి రేటు బెంగళూరుతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంటోంది. వెండి కిలో ఒక్కింటికి బెంగళూరులో 70,500 రూపాయల మేర నమోదు కాగా.. హైదరాబాద్, విశాఖపట్నంలల్లో 70,300 రూపాయల వద్ద నిలిచింది.
కాగా- అక్షయ తృతీయ నాడు పసిడి కొనుగోళ్లు, దానికి సంబంధించిన లావాదేవీలు పెద్ద ఎత్తున నమోదవుతుంటాయి. అక్షయ తృతీయ నాడు వీసమెత్తు బంగారమైన కొనుగోలు చేయాలనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఏడాది మొత్తం ఎలా గడిచినా.. ఆ సందర్భంగా బంగారు దుకాణాల ముందు బారులు తీరుతుంటారు కొనుగోలుదారులు. పది సంవత్సరాలుగా అక్షయ తృతీయ రోజు నాడు బులియన్ మార్కెట్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసుకుంటూ వచ్చాయి.
ఏప్రిల్ 24 2021లో 10 గ్రాముల బంగారం ధర 28,710 రూపాయలు కాగా.. ఆ మరుసటి ఏడాది మరింత తగ్గింది. మే 13 2013 అక్షయ తృతీయ నాడు ఎంసీఎక్స్లో లో దాని ధర 26,867గా నిలిచింది. మే 2, 2014లో 30,182, ఏప్రిల్ 21 2015లో 26,803, మే 9 2016లో 29,805, ఏప్రిల్ 28 2017లో 28,872, ఏప్రిల్ 18 2018లో 31,410, మే 7 2019లో 31,739 రూపాయలు పలికింది బంగారం ధర. ఓ మోస్తరు స్థాయి ధరలకు అక్కడితో బ్రేక్ పడింది.
ఆ మరుసటి ఏడాది నాటికి పసిడి ధర అమాంతం పెరిగింది. లాంగ్ జంప్ చేసింది. 2020లో ఏప్రిల్ 27వ తేదీన వచ్చిన అక్షయ తృతీయ నాటికి బంగారం ధర 46,353 రూపాయలకు పెరిగింది. బంగారం ధరల్లో 46.04 శాతం మేర పెరుగుదల కనిపించింది. కరోనా వైరస్ ఆరంభమైన తొలి రోజుల్లోనూ బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది ఆ రేటు మరింత పెరిగింది. శుక్రవారం నాటి అక్షయ తృతీయ నాడు ఎంసీఎక్స్ వద్ద బంగారం రేటు 47,452 వద్ద నిలిచింది.