షాకిస్తున్న బంగారం: రెండ్రోజుల్లో రూ.1,800 పెరుగుదల, ఆల్ టైమ్ గరిష్టానికి పల్లాడియం
న్యూఢిల్లీ: అమెరికా - ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే 10 గ్రాముల పసిడి ఏకంగా రూ.1,800 పెరిగింది. ఎంసీఎక్స్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్లో 10 గ్రాములు 2.3 శాతం (రూ.918) పెరిగి రూ.41,030కి చేరుకుంది. శుక్రవారం 2 శాతం (రూ.850) పెరిగింది. దీంతో ఈ రెండు రోజుల్లోనే ఏకంగా రూ.1,800 వరకు పెరిగింది. మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్లో కిలో వెండి 2 శాతం (రూ.947) పెరిగి రూ.48,474కు చేరుకుంది.
అమెరికా ఎఫెక్ట్: రెండ్రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర
ఈ రోజు మరెంత పెరగవచ్చునంటే?
డాలర్తో రూపాయి మారకం విలువ సోమవారం రూ.72 దాటింది. ఈ ప్రభావం బంగారంపై పడింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. బంగారం ధర ఈ రోజు రూ.41,300కు, వెండి ధర కిలో రూ.48,900కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
గత వారం 2.3 శాతం మేర పెరుగుదల
వారంతంలో అమెరికా - ఇరాన్ ఉద్రిక్తతలతో పాటు వివిధ కారణాలతో గత వారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 2.3 శాతం మేర పెరిగాయి. ధరలు ఆరేడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని బులియన్ మార్కెట్ అంచనా వేస్తోంది.
ఔన్స్ 1,573 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 1.4 శాతం పెరిగి 1,573.14 డాలర్లకు చేరుకుంది. ఏకంగా 1.8 శాతం పెరిగింది. ఏప్రిల్ 10, 2013 తర్వాత అత్యంత గరిష్టానికి చేరుకుంది. ఏడేళ్ల క్రితం (ఏప్రిల్ 10, 2013) బంగారం 1,579.55 డాలర్ల వద్ద ఉంది. ఇప్పుడు సమీపంలో ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.6 శాతం పెరిగి 1,577.80 డాలర్ల వద్ద ఉంది. గత ఏడాది రెండో అర్ధభాగంలో బంగారం 1,550కి చేరుకున్నాయి. ఇప్పుడు మరో 25 డాలర్లు అధికంగా పెరిగింది. ఇటీవలి వరకు 1,500 డాలర్ల లోపు కూడా ఉంది.
పల్లాడియం ఆల్ టైమ్ హిట్
ఇక మరో అత్యంత విలువైన లోహం పల్లాడియం 2,000 డాలర్లు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,011.48 డాలర్లకు చేరుకోవడం ద్వారా జీవన కాల గరిష్టానికి చేరుకుంది. గతంలో దీని రికార్డ్ 2,006.32 వద్ద అల్ టై హైగా ఉంది. ఇప్పుడు దానిని కూడా దాటేసింది.
వెండి, ప్లాటినం ధరలు కూడా..
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్ 2 శాతం పెరిగి 18.39 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం 0.6 శాతం పెరిగి 985.87 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం సహా విలువైన లోహాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.