ఒక్కరోజే రూ.1,000 పెరిగి, నేడు తగ్గిన బంగారం ధర: ధర పెరిగేందుకు దారి తీసే కారణాలు
బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. చైనా కరోనా వైరస్ భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పసిడి వైపు చూస్తున్నారు. సోమవారం రూ.1,000 వరకు పెరిగింది. వరుసగా ఐదు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు రికార్డ్ హైకి చేరుకొని, మంగళవారం (25 ఫిబ్రవరి) స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కూడా భారీగానే పెరిగింది.
కరోనా వైరస్ ఎఫెక్ట్: బంగారం, డాలర్ల దిశగా ఇన్వెస్టర్లు, మార్కెట్ నష్టాలకు కారణాలివే
ఎంసీఎక్స్లో రూ.584 తగ్గుదల
ఎంసీఎక్స్లో ఏప్రిల్ 10 గ్రాముల బంగారం ధరలు 1.34 శాతం లేదా రూ.584 తగ్గి రూ.42,992కు చేరుకున్నాయి. గత ఐదు రోజుల్లో తగ్గుదల ఇదే కావడం గమనార్హం. సోమవారం వరకు ఐదు సెషన్లలో రూ.3,000 వరకు పెరిగింది. రూ.43,788 గరిష్టాన్ని తాకింది. వెండి ధర ఎంసీఎక్స్లో 1.6 శాతం తగ్గి రూ.48,580కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్లలోను బంగారం ధర 1 శాతం తగ్గింది. సోమవారం ఏడేళ్ల గరిష్టానికి బంగారం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. స్పాట్ గోల్డ్ 1,642.89 డాలర్లకు పడిపోయింది. అంతకుముందు సెషన్లో 1,688.66 డాలర్ల గరిష్టానికి చేరుకుంది. కరోనా వైరస్ చైనాతో పాటు ఇతర దేశాలకు పాకుతోంది. ఈ భయాల నేపథ్యంలో బంగారం ధర ఐదు రోజులుగా పెరిగింది.
ఢిల్లీ, హైదరాబాద్లలో ధర..
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.953 పెరిగి రూ.44,472కు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం సాయంత్రం రూ.45,000కు చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం హైదరాబాదులో రూ.44,920గా ఉంది. కిలో వెండి ధర రూ.50,555కి పెరిగింది.
ఏడాదిలో రూ.12,000 పెరిగిన ధర
గత డిసెంబర్ నెలలో ఔన్స్ బంగారం ధర 1450 డాలర్లుగా ఉంది. సోమవారానికి 1680కి చేరుకుంది. మంగళవారం 1650కి దగ్గరగా ఉంది. భారత్లో 2019 మార్చిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు 3,280గా ఉంది. ఇప్పుడు ఆ ధర రూ.4,500కు చేరుకుంది. అంటే గ్రాముకు రూ.1,220 పెరిగింది. పది గ్రాములకు రూ.12,000 వరకు పెరిగింది. ఏడాది లోపే ధరలు దాదాపు 12 వేల వరకు పెరగడంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు ముందుకు రావట్లేదు.
స్థిరంగా ఉంటేనే కొనుగోళ్లు
నాలుగు నుండి ఆరు నెలల పాటు బంగారం ధరలు స్థిరంగా ఉంటే కొనుగోళ్లు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏడెనిమిదేళ్ల గరిష్టానికి చేరుకోవడం గమనార్హం. అంతర్జాతీయంగా కరోనా వైరస్ ప్రభావంతో పాటు ఇండియాలో డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం కారణం.
అనూహ్యంగా డిమాండ్
కరోనా మరిన్ని దేశాలకు పాకుతుండటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ అన్నారు.
ధర పెరగడానికి దారి తీసిన కారణాలు
- పసిడి గనులు అధికంగా ఉండే దక్షిణాఫ్రికా ప్రాంతంలో కార్మికుల వేతనాలు 200 శాతం పెరిగాయని, గనుల్లో లభ్యత తగ్గినందున తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నారని చెబుతున్నారు.
- చైనా, హాంకాంగ్ మీదుగా బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. కరోనా వైరస్ వల్ల విమానాలు, నౌకల రవాణా ఆగి ఇప్పుడు నిలిచిపోయింది.
దిగుమతులపై ఆధారపడటమూ కారణమే
- మన దేశం పూర్తిగా దిగుమతులపై ఆధారపడినందున డాలర్ విలువ పెరిగినప్పుడల్లా బంగారం భారంగా మారుతోంది.
- తమ వద్ద ఉన్న నిల్వల నుండి ఏ దేశ కేంద్రీయ బ్యాంకు అయినా అమ్మకానికి పెడితేనే ప్రస్తుత ధరలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. లేదంటే 10 గ్రాములు రూ.50 వేలు కూడా పెరగవచ్చునని అంటున్నారు.