వరుసగా మూడో రోజు... పెరిగిన బంగారం ధరలు, కారణాలివే
బంగారం ధరలు గురువారం (నవంబర్ 14) స్వల్పంగా పెరిగాయి. వరుసగా మూడో రోజు పసిడి ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్లో గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ 10 గ్రాములకు 0.14 శాతం పెరిగి రూ.38,150 వద్ద ఉంది. వెండి ధర 0.33 శాతం పెరిగి కిలో రూ.44,680 వద్ద ఉంది. బంగారం ధరలు ఇటీవల రూ.37,500కు చేరుకున్నాయి. తిరిగి పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లు, అమెరికా - చైనా వాణిజ్య చర్చల ప్రభావం, రూపాయి బలహీనపడటం వంటి కారణాలు ఉన్నాయి. అయితే సెప్టెంబర్ నెలలో రికార్డ్ గరిష్ట ధర రూ.40,000 పైకి చేరుకుంది. ఆ ధరతో పోల్చుకుంటే రూ.1,850 తక్కువగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ ధర 1,464.31కు చేరుకుంది. చైనా పారిశ్రామికోత్పత్తి అక్టోబర్ నెలలో ఊహించిన దానికి భిన్నంగా ఉంది. దీనికి అమెరికా - చైనా వాణిజ్య చర్చల్లో డైలమా కూడా తోడయింది.
అమెరికా - చైనా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయని భావిస్తున్నారని, అలా జరగకుంటే బంగారానికి మరింత డిమాండ్ పెరగవచ్చునని అంటున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విషయంలో తగ్గనని ప్రకటించారు. దీంతో మార్కెట్ డైలమాలో ఉందని చెబుతున్నారు.