బంగారం ధరల పెరుగుదలపై బ్యాంకింగ్ దిగ్గజం జెఫరీస్ ఆందోళన.. ఈ పెను ముప్పుకు కారణం ఏంటంటే..
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరల విశ్లేషణకు సంబంధించి ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం 'జెఫరీస్' (Jefferies) ఒక సంచలనాత్మక నూతన అధ్యయనాన్ని వెల్లడించింది. దశాబ్దాలుగా పసిడి రేట్లను ప్రభావితం చేస్తున్న వాస్తవ వడ్డీ రేట్లు, డాలర్ సూచీ, స్వల్పకాలిక ద్రవ్య సరఫరా వంటి సాంప్రదాయ అంశాలను పక్కనపెట్టి, ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల రిజర్వ్ నిర్వహణ విధానాలు, ప్రభుత్వ ద్రవ్య లోటుల ఆధారంగా ఒక కొత్త పరిమాణాత్మక ఫ్రేమ్ వర్క్ (Quantitative Framework) రూపొందించింది. ఈ అధునాతన మోడల్ ఆధారంగా.. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 4,650 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంటుందని జెఫరీస్ అంచనా వేసింది.
గత 2024 నుండి 2025 వరకు ఉన్న వ్యవధిలో Gold ధరలు వాస్తవ వడ్డీ రేట్లు, డాలర్తో తమకున్న చారిత్రక బంధాన్ని తెంచుకుని అనూహ్యంగా పైకి దూసుకెళ్లాయని జెఫరీస్ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. కేవలం పాత చారిత్రక గణాంకాల ఆధారంగా పనిచేసే రిగ్రెషన్ నమూనాలు ప్రస్తుత స్పాట్ ధర కంటే చాలా తక్కువ విలువను సూచిస్తూ విఫలమయ్యాయని పేర్కొంది. ఈ పరిమితులను అధిగమించడానికి 1995 నుండి 2025 వరకు గత 30 ఏళ్ల డేటాను లోతుగా పరిశీలించి.. మొదటి నుండి కొత్త మోడల్ను రూపొందించినట్లు విశ్లేషకులు స్పష్టం చేశారు.

ఈ కొత్త నమూనా ప్రధానంగా మూడు కీలక అంశాలపై కేంద్రీకృతమైంది. సెంట్రల్ బ్యాంకులు ఏటా కొనుగోలు చేసే నికర పసిడి నిల్వలకు, ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో అమెరికన్ డాలర్ వాటాకు ఉన్న నిష్పత్తిని సూచించే 'రిజర్వ్ వైవిధ్య తీవ్రత' ఇందులో మొదటిది కాగా.. సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్లలో బంగారం యూఎస్ ట్రెజరీ బాండ్లను అధిగమించిందో లేదో తెలిపే సూచీ రెండవది. అలాగే అమెరికా జీడీపీలో ప్రభుత్వ ద్రవ్య లోటు వాటా మూడవ ప్రధాన వేరియబుల్గా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విదేశీ మారక నిల్వల్లో డాలర్ భారాన్ని తగ్గించుకుని బంగారంలోకి వైవిధ్యపరచడం వేగవంతం కావడం వల్లే పసిడి ర్యాలీ కొనసాగుతోందని జెఫరీస్ వాదిస్తోంది.
ఈ అధ్యయనం ఫలితంగా జెఫరీస్ మునుపటి అంచనాలైన 2026 ద్వితీయార్థంలో ఔన్సుకు 4,500 డాలర్లు, 2027 ప్రథమార్థంలో 5,000 డాలర్ల లక్ష్యాలకు మరింత బలం చేకూరింది. కోవిడ్ కాలం నాటి 14 శాతం ద్రవ్య లోటు పరిస్థితులు పునరావృతమైనా, విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా 40 శాతానికి పడిపోయినా, లేదా సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్ల వేగాన్ని రెట్టింపు చేసినా బంగారం ధర త్వరలోనే 5,000 డాలర్ల మార్కును దాటుతుందని సంస్థ నివేదించింది.
అయితే, సెంట్రల్ బ్యాంకులు తమ కొనుగోళ్లను నిలిపివేసి నికర అమ్మకాల వైపు మళ్లడమే ఈ Gold బుల్ రన్కు ఉన్న ఏకైక ముప్పని హెచ్చరించింది. ఈ ధరల పెరుగుదల వల్ల మైనింగ్, రాయల్టీ కంపెనీల ఆదాయం, ఉచిత నగదు ప్రవాహం (Free Cash Flow) గణనీయంగా పెరిగి ఈక్విటీ ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు దక్కుతాయని నిపుణులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

