బంగారం ధరల పెరుగుదలపై ఆందోళన.. క్లారిటీ ఇచ్చిన నిర్మలమ్మ.. కారణం ఇదేనంటున్న ఆర్బీఐ గవర్నర్
దేశీయంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని స్థాయిలో పెరుగుతున్నాయి. పసిడి ప్రియులు బంగారం కొనుగోలు చేయాలంటేనే హడలిపోతున్నారు. దేశీయంగా బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు పసిడి ప్రియుల పాలిట శాపంలా మారుతున్నాయి. పసిడి ధరలు పెరుగుదల పెట్టుబడిదారులకు లాభాల పంటను పండిస్తే సామాన్యులకు మాత్రం కొనుగోలు మీద విరక్తి పుట్టేలా చేస్తోంది.
బంగారం ధరలు దేశంలో ఇటీవల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా మారుతుందా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

బడ్జెట్ అనంతరం జరిగిన సమావేశంలో RBI సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఉద్దేశించి మాట్లాడిన నిర్మలా సీతారామన్.. దేశీయ మార్కెట్లో వినియోగంలో ఉన్న Gold దాదాపు మొత్తం దిగుమతుల ద్వారానే వస్తుందని తెలిపారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లలో జరిగే మార్పులు భారత బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని ఆమె చెప్పారు.
ప్రస్తుత బంగారం ధరల పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని.. అయితే అది ఇంకా ఆందోళనకరమైన హద్దును దాటలేదని ఆమె అభిప్రాయపడ్డారు. పండుగల సీజన్లో గృహ వినియోగం పెరగడం వల్ల డిమాండ్ సహజంగానే ఎక్కువవుతుందని, Gold భారతీయ కుటుంబాలకు సంప్రదాయ పెట్టుబడిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందం లేదా అమెరికా టారిఫ్ నిర్ణయాల ప్రభావంపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటుగా ఉంటుందని కూడా ఆమె స్పష్టం చేశారు.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే ప్రధాన కారణం: RBI గవర్నర్
RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు బంగారం, వెండిని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలిపారు. ఇది కేవలం భారత మార్కెట్కు మాత్రమే సంబంధించిన విషయం కాదని, గ్లోబల్ ట్రెండ్గా మారిందని అన్నారు. డాలర్ విలువలో మార్పుల కారణంగా US సెక్యూరిటీల హోల్డింగ్స్ను తగ్గించినట్లు ఆయన స్పష్టం చేశారు. దీనికి ఇతర ఆర్థిక లేదా రాజకీయ కారణాలు లేవని కూడా చెప్పారు.
ఆర్థిక స్థిరత్వంపై స్పందిస్తూ.. భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని, ప్రస్తుతం బ్యాంకుల మూలధన సమృద్ధి నిష్పత్తి సుమారు 17 శాతంగా ఉందని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలు కొత్త మూలధనం సమీకరించకపోయినా, బ్యాంకులు తమ అవసరాలను తీరుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాదిలో బ్యాంకింగ్ రంగానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని కూడా వెల్లడించారు.
ద్రవ్యోల్బణంపై మాట్లాడుతూ.. వినియోగదారుల ధరల సూచిక (CPI) లెక్కించే విధానంలో మార్పులు అవసరమైతే RBI పరిశీలిస్తుందని మల్హోత్రా తెలిపారు. ఏప్రిల్లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మార్జిన్ ట్రేడింగ్ సౌకర్యం (MTF) విషయంలో ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు చేయాలన్న ప్రతిపాదన లేదని, వాటాదారుల సంప్రదింపుల తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. IDFC ఫస్ట్ బ్యాంక్ మోసంపై స్పందిస్తూ.. ఇది వ్యవస్థాగత సమస్య కాదని, RBI పరిస్థితిని గమనిస్తోందని మాత్రమే పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, సెబీ మరియు RBI కలిసి కార్పొరేట్ బాండ్ ఇండెక్స్, సంబంధిత ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాయని సెబీ చైర్మన్ తెలిపారు. పెట్టుబడిదారులు, పరిశ్రమ అభిప్రాయాల ఆధారంగా నిబంధనల సమీక్ష జరుగుతోందన్నారు. ఏదేమైనా బంగారం ధరల పెరుగుదల వెనుక దేశీయ కారణాలకన్నా గ్లోబల్ అంశాలే ఎక్కువగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం, RBI స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది నియంత్రణలోనే ఉందని, అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications



