బంగారంపై ఆశలు వదిలేసుకోండి.. 10 గ్రాముల ధర రూ. 3 లక్షలు పైమాటే.. క్రిస్ వుడ్ షాకింగ్ అంచనా ఇదిగో..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు 10 వేల డాలర్ల మార్కును తాకితే.. భారతదేశంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 3.08 లక్షలను దాటే అవకాశం ఉందని జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్ వుడ్ వెల్లడించారు. CNBC TV18కి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా డాలర్ తీవ్ర బలహీనతకు గురై, అక్కడి ట్రెజరీ ఈల్డ్స్ను నియంత్రించాల్సిన పరిస్థితులు ఏర్పడితే Gold ఈ రికార్డు స్థాయికి చేరవచ్చని వివరించారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $4,366.80 వద్ద ఉడగా.. అమెరికన్ డాలర్ మారకం రేటు రూ. 96 వద్ద స్థిరంగా ఉంటే 10 గ్రాముల ప్రాథమిక బంగారం ధర దాదాపు రూ. 1.35 లక్షలుగా ఉంటుంది. ఒకవేళ Gold ధర $10,000కి పెరిగి, డాలర్ రేటు రూ. 96 వద్దే ఉంటే, త్రాయ్ ఔన్సు (31.10 గ్రాములు) లెక్కన ఒక గ్రాము ధర రూ. 30,865 కాగా, 10 గ్రాముల ధర రూ. 3,08,650కి చేరుకుంటుంది. అంటే ఇది ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు 129% లేదా రూ. 1,73,870 మేర పెరుగుదలను సూచిస్తుంది. పన్నులు, దిగుమతి సుంకాలు, మేకింగ్ ఛార్జీలు కలిపితే రిటైల్ మార్కెట్ ధర ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఈ రకమైన విపరీతమైన ధరల పెరుగుదల ఆభరణాలు కొనుగోలు చేసేవారిపై భారం మోపినప్పటికీ, ఇప్పటికే పసిడిని కలిగి ఉన్న భారతీయ కుటుంబాలకు ఇది ఒక సంప్రదాయ సంపద సృష్టిగా మారుతుందని క్రిస్ వుడ్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ బంగారాన్ని అమ్ముకుంటారని కాదు గానీ, కుటుంబాల "కాగితపు సంపద" (Paper Wealth) గణనీయంగా పెరుగుతుంది.
ఉదాహరణకు, ఒక కుటుంబం వద్ద 100 గ్రాముల బంగారం ఉంటే దాని ప్రాథమిక విలువ రూ. 30.86 లక్షలకు, ఒక కిలో బంగారం విలువ రూ. 3.09 కోట్లకు చేరుతుంది. 200 గ్రాముల బంగారం ఉన్న కుటుంబాల నికర సంపద రూ. 61.73 లక్షలు దాటుతుంది. ఈ పెరిగిన విలువను అత్యవసర సమయాల్లో గోల్డ్ లోన్లు పొందడానికి, గృహ కొనుగోళ్లకు లేదా వ్యాపార విస్తరణకు ఆర్థిక భద్రతగా వాడుకోవడానికి వీలవుతుంది. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి మారకం రేటు రూ. 100కి బలహీనపడితే ఈ ధర రూ. 3.22 లక్షల వరకు వెళ్ళవచ్చని, రూపాయి బలపడితే స్వల్పంగా తగ్గొచ్చని వారు విశ్లేషించారు.
అయితే, $10,000 అనేది నిర్దిష్టమైన గడువుతో కూడిన లక్ష్యం కాదని, యూఎస్ బాండ్ మార్కెట్లో తలనెత్తే రుణ సవాళ్లపై ఆధారపడి ఉంటుందని పెట్టుబడిదారులు గ్రహించాలి. యూఎస్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్స్ 5% దాటితే అది తీవ్ర ఆర్థిక ఒత్తిడికి సంకేతమని, దానిని నియంత్రించేందుకు అమెరికా వ్యవస్థలోకి మరింత డబ్బును చొప్పించాల్సి వస్తుందని, ఇది డాలర్ పతనానికి దారితీస్తుందని వుడ్ స్పష్టం చేశారు.
డాలర్ బలహీనపడితే భారతదేశం వంటి వర్ధమాన మార్కెట్లకు విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇదొక తీవ్ర అస్థిరతకు సంకేతంగా ఉంటుంది. అందువల్ల పెట్టుబడిదారులు కేవలం లాభాల అంచనాలతో కాకుండా, బంగారాన్ని ఒక త్వరితగతిన ధనవంతులను చేసే సాధనంగా కాకుండా తమ పోర్ట్ఫోలియోను రక్షించే ఒక సురక్షిత "భద్రతా వలయం" (Hedging Tool) లాగా మాత్రమే చూడాలని, దశలవారీగా క్రమబద్ధమైన పద్ధతిలో కేటాయింపులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

