బంగారం ధరలు ఔన్సుకు 5 వేల డాలర్ల పైమాటే.. మెటల్స్ ఫోకస్ సంచలన నివేదిక..
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాలు, సామాన్య ఇన్వెస్టర్లలో బంగారం, వెండి ధరలపై తీవ్ర ఆసక్తి నెలకొన్న తరుణంలో మెటల్స్ ఫోకస్ సంస్థ ఆసక్తికర విశ్లేషణను వెలువరించింది. సదరు సంస్థలో సౌత్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ సీనియర్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న హర్షల్ బరోత్ ప్రకారం.. 2026 సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో Gold ధరలు ఔన్సుకు 4,800 డాలర్ల నుండి 5 వేల (4,800-5,000) డాలర్ల స్థాయికి చేరుకునే బలమైన అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై ఔన్సుకు 4వేల డాలర్ల మార్కు వద్ద Gold ధర స్థిరంగా కొనసాగుతుండటం.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'యూఎస్ ఫెడరల్ రిజర్వ్' వడ్డీ రేట్ల పెంపు విషయంలో గతంలో లాగా కఠినంగా లేదా దూకుడుగా ఉండకపోవచ్చనే అంచనాలు ఈ విలువైన లోహానికి అత్యంత సానుకూల అంశాలుగా మారనున్నాయి.

అమెరికాలో ఇటీవల విడుదలైన బలహీనమైన ఉపాధి గణాంకాలు, దానికి తోడు కరెన్సీ, బాండ్ మార్కెట్లలో కనిపించిన ఒడిదుడుకుల వల్ల వడ్డీ రేట్లను వేగంగా పెంచే సామర్థ్యాన్ని ఫెడ్ కోల్పోతోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ఫెడ్ సెంట్రల్ బ్యాంక్ ఒక విడత వడ్డీ రేట్లను పెంచినప్పటికీ, దానిని ఒక పెద్ద ద్రవ్య బిగింపు చక్రంగా భావించాల్సిన అవసరం లేదని హర్షల్ బరోత్ స్పష్టం చేశారు.
ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తే ఇక్కడి నుండి బంగారం ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయిల వైపు పుంజుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఔన్సుకు నాలుగు వేల ఐదు వందల డాలర్ల వద్ద స్వల్ప నిరోధం (రెసిస్టెన్స్) ఎదురైనప్పటికీ, బంగారం ప్రధాన గమనం, భవిష్యత్తు ధోరణి మాత్రం సానుకూలంగానే ముందుకు సాగుతుందని అంచనా వేశారు.
భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న పండుగలు, వివాహాల సీజన్ వల్ల దేశీయంగా పసిడికి విశేషమైన కాలానుగుణ డిమాండ్ పెరగనుంది. ఇది అంతర్జాతీయంగా పసిడి రికార్డు రాలీకి అదనపు బలాన్ని అందిస్తుంది. అధిక బంగారం ధరల వల్ల ఆభరణాల విక్రయ పరిమాణం లేదా వాల్యూమ్లపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, భారతీయ రిటైలర్లు మరియు తయారీదారులలో సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడింది.
ఈ ఏడాది మొదటి రెండు త్రైమాసికాల్లో డిమాండ్ మందకొడిగా సాగడంతో.. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారులు మళ్లీ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిశ్రమ సమావేశంలో తయారీదారులు పొందిన ఆర్డర్ల పరిమాణం గతేడాది కంటే అధికంగా నమోదైందని, కొందరు విశ్లేషకులు దీనిని కోవిడ్ తదనంతర కాలంలో నమోదు కాబడిన అత్యంత బలమైన డిమాండ్గా అభివర్ణించారు. ఆ రకంగా చూస్తే ఆగస్టు నెల నుండి భారతీయ బంగారం దిగుమతులు క్రమంగా పుంజుకోవడం విశేష ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
ఇక వెండి విషయానికి వస్తే.. స్థూలంగా బంగారం దారినే అనుసరిస్తూ రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా పెరుగుదల ధోరణిలోనే సాగుతాయని బరోత్ చెప్పారు. స్వల్పకాలంలో బంగారం కంటే వెండి పనితీరు కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, అంతిమంగా వెండి ధర ఔన్సుకు ఎనభై ఐదు నుండి తొంభై ($85-90) డాలర్ల వైపునకు దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. అయితే వెండి విషయంలో దిగుమతుల కోటానే ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది.
భారతీయ వ్యాపారులకు అందుబాటులో ఉన్న వెండి దిగుమతి పరిమితులు కాలానుగుణంగా వచ్చే సాధారణ డిమాండ్ కంటే తక్కువగా ఉన్నాయి. జూలై నెలలో దిగుమతులపై తీవ్ర పరిమితులు విధించడంతో లభ్యత తగ్గి, ఔన్సుపై ప్రీమియం గరిష్టంగా ఆరున్నర డాలర్లకు పెరిగింది, ప్రస్తుతం అది రెండున్నర డాలర్ల వద్ద ఉంది. పండుగల సీజన్ నాటికి వ్యాపారులకు సరిపడా వెండి దిగుమతి కాకపోతే, దేశీయ మార్కెట్లో లభ్యత తగ్గి ధరలపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. రాబోయే కాలంలో పసిడి తన అద్భుతమైన పనితీరును కొనసాగించినప్పటికీ..వెండి రాలీ మాత్రం భారతీయ మార్కెట్లోకి వచ్చే దిగుమతుల పరిమాణంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన ముగించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
