ఇళ్లలో మూలుగుతున్న వేల టన్నుల బంగారం.. మొత్తాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చేలా కేంద్రం నయా ప్లాన్ ..
Gold Monetisation Scheme 2.0: భారతీయ కుటుంబాలు, దేవాలయాల్లో, అలాగే వ్యాలెట్ సంచులలో వాడకుండా మూలన పడి ఉన్న సుమారు 5 ట్రిలియన్ డాలర్ల భారీ బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఈ భారీ లోహ నిల్వలను చురుకైన ఆర్థిక ఆస్తిగా మార్చే లక్ష్యంతో.. అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు నగదీకరణ పథకం (Gold Monetisation Scheme - GMS) ను సరికొత్త ప్రతిపాదనలతో పునరుద్ధరించాలని యోచిస్తోంది.
గతంలో బ్యాంకుల ద్వారా అమలు చేసినప్పుడు ప్రజాదరణ పొందని ఈ పథకంలో.. ఈసారి భారతీయులకు అత్యంత నమ్మకమైన వర్గమైన నగల వ్యాపారులను (Gold) భాగస్వాములను చేయడమే కాకుండా.. వారికి అదనపు ప్రోత్సాహకాలను అందించే ప్రతిపాదన రూపొందించారు. ఈ పథకం ఆమోదం పొంది అమల్లోకి వస్తే భారతదేశ బంగారు దిగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం.. ఆభరణాల వ్యాపారులు వినియోగదారుల నుంచి సేకరించే పాత బంగారం విలువపై 0.75% నుండి 1% వరకు కమీషన్ పొందే అవకాశం ఉంది. జెమ్స్ & జ్యువెలరీ కౌన్సిల్ ఛైర్మన్ రాజేష్ రోక్డే, ఐబీజేఏ అధ్యక్షుడు పృథ్వీరాజ్ కోఠారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ కోసం ప్రభుత్వం నుండి తుది ఆమోదం రావాల్సి ఉంది.
టర్నోవర్పై లభించే ఈ 100 బేసిస్ పాయింట్ల మార్జిన్.. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద జ్యువెలర్లను ఈ పథకం పట్ల ఆకర్షితులను చేస్తుందని.. వారు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రతి ఇంటికీ ఈ పథకాన్ని తీసుకెళ్తారని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
నగల వ్యాపారులకు లభించే ప్రధాన ప్రయోజనాలు:
తక్కువ వడ్డీ రుణాలు: ప్రస్తుతం గోల్డ్ మెటల్ లోన్ల వడ్డీ రేట్లు 5% వరకు ఉండగా, దేశీయ బంగారం అందుబాటులోకి వస్తే వడ్డీ రేట్లు 50 నుండి 100 బేసిస్ పాయింట్లు తగ్గుతాయి. సాధారణ వర్కింగ్ క్యాపిటల్ రుణాల (8.5% - 10.5%) తో పోలిస్తే వడ్డీ వ్యయంలో ఏటా 6% వరకు ఆదా అవుతుంది.
హెడ్జింగ్ ఖర్చుల ఆదా: బంగారం స్వయంగా ఇన్వెంటరీగా ఉపయోగపడటం వల్ల విడిగా హెడ్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల మరో 4% నుండి 4.5% వరకు ఖర్చులు తగ్గుతాయి.
స్టోర్ వ్యాపార వృద్ధి: కొనుగోలుదారులు పాత బంగారంతో దుకాణాలకు రావడం వల్ల ఇతర ఆభరణాల విక్రయాలు పెరిగే అవకాశం ఉంది.
భారీగా పడిపోనున్న దిగుమతి బిల్లు:
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారులలో ఒకటైన భారతదేశం.. ఏటా 700 నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతి బిల్లు రికార్డు స్థాయిలో $71.9 బిలియన్లకు చేరుకుంది. విదేశీ మారక నిల్వలపై ఈ దిగుమతులు తీవ్ర ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. దేశీయంగా ఉన్న 25 వేల నుండి 30 వేల టన్నుల బంగారాన్ని చలామణిలోకి తేవడం వల్ల దిగుమతులు తగ్గుతాయని కోటక్ సెక్యూరిటీస్ ప్రతినిధి సునీల్ కట్కే, సెన్కో గోల్డ్ సీఈఓ సువంకర్ సేన్ అభిప్రాయపడ్డారు.
2015లో ప్రారంభించిన జిఎంఎస్ పథకం ద్వారా నవంబర్ 2024 నాటికి కేవలం 31 టన్నుల బంగారం మాత్రమే సమీకరించబడింది. బ్యాంకులలో సిబ్బంది కొరత, స్వచ్ఛత తనిఖీలపై నమ్మకం లేకపోవడం, నగల వ్యాపారులను దూరంగా ఉంచడమే దానికి కారణం. అయితే తాజా సవరణలతో తయారీదారులు, రిటైలర్లు, కస్టమర్లు ఒకే వేదికపైకి రావడం వల్ల ఈసారి పథకం విజయవంతమవుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications
