అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన యువతరం.. తీర్చేదారి లేక ఉన్న బంగారాన్ని లోన్లలో పెట్టి..
భారత రిటైల్ క్రెడిట్ మార్కెట్లో బంగారు రుణాలు (Gold Loans) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆధారంగా ఆవిర్భవిస్తున్నాయి. గృహ రుణాల తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద రిటైల్ రుణ విభాగంగా అవతరించిన ఈ రంగం.. ఒకవైపు వేగవంతమైన వృద్ధిని కనబరుస్తుండగానే, మరోవైపు కొన్ని తీవ్రమైన ఒత్తిడి సంకేతాలను కూడా ఎదుర్కొంటోంది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ వేదికగా ట్రాన్స్యూనియన్ సిబిల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ భావేష్ జైన్ మాట్లాడుతూ.. Gold రుణాల వ్యాపారంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో పాటు రుణగ్రహీతల మానసిక, ఆర్థిక ప్రొఫైల్లో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు.
భావేష్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో బంగారు రుణాలు తీసుకుంటున్న ప్రతి ఐదుగురు రుణగ్రహీతలలో ఒకరు (దాదాపు 20 శాతం మంది) ఇప్పటికే వేరొక క్రెడిట్ ఖాతాలో నిరర్థక ఆస్తిగా (NPA) నమోదై ఉన్నారు. అంటే ఈ రుణగ్రహీతలు తమ బంగారం తాకట్టు పెట్టడానికి ముందే పర్సనల్ లోన్స్, వాహన రుణాలు లేదా క్రెడిట్ కార్డుల వంటి ఇతర రుణ విభాగాలలో బకాయిపడి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే, వ్యవస్థాగతంగా చూస్తే మొత్తం Gold రుణాల బకాయిలు ఇప్పటివరకు 0.3 శాతంగా నమోదై సాపేక్షంగా చాలా తక్కువ స్థాయిలోనే సురక్షితంగా ఉండటం ఊరట కలిగించే అంశం.

మరోవైపు బంగారు రుణాలు తీసుకునే వారి వయస్సు, వర్గానికి సంబంధించి సాంప్రదాయ భావనలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం వయసు పైబడిన వారు లేదా పాతతరం వ్యక్తులు మాత్రమే బంగారు రుణాలను ఆశ్రయిస్తారనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రుణాల మొత్తం డిమాండ్లో 'జెన్ జెడ్' (యువతరం) వాటా ఏకంగా 20 శాతానికి చేరుకుంది. ఇతర రకాల రుణాల ఒత్తిడిని తట్టుకోవడానికి, తక్షణ ఆర్థిక అవసరాల కోసం యువతరం ఈ బంగారు రుణాలను ఎక్కువగా వాడుతుండటంతో.. వారు తాకట్టు పెడుతున్న బంగారం యొక్క అసలు మూలం ఏమిటనే ప్రశ్నలు ఆర్థిక విశ్లేషకులలో తలెత్తుతున్నాయి.
ఇటీవలి కాలంలో పసిడి ధరలు నిరంతరం పెరగడం, బంగారం ఆధారిత రుణాల వ్యవస్థ క్రమబద్ధీకరించబడటం వల్ల ఈ రంగానికి విపరీతమైన ఆదరణ పెరిగింది. రుణ సరఫరా విస్తరణలో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCలు) పాత్ర ఎంతో కీలకమని, కొత్తగా రుణం తీసుకునే కస్టమర్లలో దాదాపు సగం మంది NBFCల నుంచే వస్తున్నారని.. ఇవి బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీల కంటే ముందంజలో ఉన్నాయని భావేష్ జైన్ పేర్కొన్నారు. వ్యవస్థ పరంగా ఈ రుణాలు సురక్షితమైనవిగా కనిపించినప్పటికీ.. రుణగ్రహీతలలో పెరుగుతున్న రుణభారాన్ని దృష్టిలో ఉంచుకుని, రుణదాతలు కేవలం పూచీకత్తుపైనే కాకుండా కస్టమర్ల నిజమైన అవసరం, తిరిగి చెల్లించే సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications
