అలర్ట్: రెండు నెలల్లో రూ.42,000కు పెరగనున్న బంగారం ధరలు!
న్యూఢిల్లీ: బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా? రూ.40,000 మార్క్ దాటనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. దీపావళి నాటికి బంగారం ధర రూ.40,000 మార్క్ చేరుకుంటుందని గతంలో అంచనాలు వేశారు. ఇది కాస్త అటు ఇటుగా అలాగే ఉంది. ఇప్పుడు డిసెంబర్ నాటికి బంగారం ధర రూ.42,000 చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అతివిలువైన లోహాల ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం రూ.39 వేలకు అటు ఇటుగా ఉంటున్న బంగారం ధర రెండు నెలల్లో అంటే ఈ ఏడాది చివరి నాటికి 42 వేల మార్క్కు చేరుకోనుందని చెబుతున్నారు.
ధన్తెరాస్: 20 టన్నులు అనుకుంటే 30 టన్నుల బంగారం సేల్స్, కానీ
రూ.42,000 మార్క్ చేరుకోవచ్చు
మిడిల్ ఈస్ట్ దేశాల్లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 1,650 డాలర్లకు, అలాగే ఎంసీఎక్స్లో రూ.42 వేలకు చేరుకోనుందని కామ్ట్రెండ్జ్ రీసెర్చ్ కో ఫౌండర్ అండ్ సీఈవో జ్ఞానశేఖర త్యాగరాజన్ తెలిపారు. సెంట్రల్ బ్యాంకు భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేయడం, తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్న ఈక్విటీ మార్కెట్లతో ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం వైపు మళ్లడం ధరలు పుంజుకోవడానికి కారణం అవుతోందన్నారు. ప్రస్తుతం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,302గా ఉంది. అంతర్జాతీయంగా ఔన్స్ ధర 1,506 డాలర్లుగా ఉంది.
15 శాతం పెరిగిన ధరలు
బంగారం ఈ ఏడాది అత్యధిక స్థాయిలో రిటర్న్స్ పంచింది. ఇప్పటి వరకు ధరలు దాదాపు 15% వరకు పెరిగాయి. రూపాయి విలువ 1.4% పతనం కావడం ధరలు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. బంగారం ధరలు అంతర్జాతీయంగా ఔన్సుకు 1,460 నుంచి 1,530 మధ్య, అలాగే భారత్లో రూ.36,800 నుంచి రూ.39,400 మధ్య ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కొటక్ సెక్యూరిటీస్ హెడ్ రవీంద్ర రావు అన్నారు.
బంగారం ధర పెరుగుదలకు పలు కారణాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠస్థాయికి పడిపోవడం, స్టాక్ మార్కెట్లు రిటర్న్స్ ఆశించిన మేర లేకపోవడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పసిడిపై పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది బంగారం గరిష్టస్థాయిలో రిటర్న్స్ పంచింది. దీంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనికి తోడు పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితులు నెలకొని ఉన్నాయి. సెంట్రల్ బ్యాంకులు అత్యధికంగా కొనుగోళ్లు జరపడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడటంతో బంగారం ధర పెరుగుతోంది.
బంగారం, భూమిపై పెట్టుబడి
ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛత కలిగిన బంగారం ఢిల్లీలో రూ.39,840గా ఉంది. ఈక్విటీ మార్కెట్ల కంటే బంగారం, భూములపై పెట్టుబడి వల్ల రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే చాలామంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. దేశాల మధ్య ట్రేడ్ వార్ కూడా బంగారం పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఆర్థిక మాంద్య భయాలు ఉన్నాయి.
పండుగ సీజన్లో...
ఇదిలా ఉండగా పండుగ సీజన్లో అమ్మకాలు తగ్గాయి. అంచనాల కంటే పెరిగినప్పటికీ, గత ఏడాది కంటే తగ్గాయి. ధన్తెరాస్, దీపావళి సగటు అమ్మకాల పరిమాణంతో పోలిస్తే 66% దిగజారి నగల విభాగంలో రూ.3,625గా నమోదయిందని వరల్డ్ లైన్ తెలిపింది.