10 రెట్లు పెరిగిన బంగారం దిగుమతులు, ఆభరణాల ఎగుమతులు కూడా జంప్
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు పదింతలు పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా 688 మిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు 2021లో అదే త్రైమాసికంలో 7.9 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. మన కరెన్సీలో గత ఏడాది జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు రూ.5,208.41 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.58,572.99 కోట్లకు చేరుకున్నాయి.
ఇక వెండి దిగుమతులు 93.7 శాతం తగ్గి, 39.4 మిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. గత ఏడాది కరోనా కారణంగా సంపూర్ణ లాక్ డౌన్ ఉండటంతో దిగుమతులు భారీగా పతనమయ్యాయి. అందుకే ఏడాది ప్రాతిపదికన దిగుమతులు భారీగా పెరిగాయి.
బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు 31 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రతి సంవత్సరం భారత్ 800 టన్నుల నుండి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో బంగారం, వజ్రాభరణాల ఎగుమతులు 9.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతులు 2.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.