బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. దేశం స్మగ్లింగ్కు అడ్డాగా మారే ప్రమాదం ఉందని GJEPC ఆందోళన..
భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అది ప్రతి కుటుంబం నమ్ముకునే ఒక బలమైన ఆర్థిక రక్షణ కవచం. అయితే, కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జ్యువెలరీ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ పన్ను పెంపు వల్ల బంగారం దిగుమతులు తగ్గడం పక్కన పెడితే, దేశీయంగా ధరలు చుక్కలనంటి సామాన్యుడికి ఈ పసిడి మరింత దూరం అవుతుందని 'జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్' (GJEPC) తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో దేశ ఆర్థిక లోటును అదుపు చేయడానికి ప్రభుత్వం ఈ అడుగు వేసినప్పటికీ, దీనివల్ల ఆశించిన ఫలితాలు రావని పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
గత కాలపు గణాంకాలను పరిశీలిస్తే.. Gold ధరలు ఎన్ని రెట్లు పెరిగినా భారతీయుల కొనుగోలు శక్తి లేదా ఆసక్తి తగ్గలేదని, కేవలం పన్నులు పెంచడం వల్ల దిగుమతులు తగ్గుతాయని భావించడం సరికాదని GJEPC పేర్కొంటోంది. దీనికి విరుద్ధంగా అధిక పన్నుల వల్ల స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
పన్ను భారం ఎక్కువైనప్పుడు అధికారిక మార్గాల ద్వారా కాకుండా దొడ్డిదారిలో Gold దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోవడమే కాకుండా, నిజాయితీగా వ్యాపారం చేసే నగల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, ఇది దేశంలో ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) రంగం కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నగల తయారీలో ఉన్న చిన్న వ్యాపారులు కిలోల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం వద్ద భారీగా బ్యాంక్ గ్యారెంటీలు ఉంచాల్సి వస్తోంది. ఇది వారి పని మూలధనాన్ని స్తంభింపజేసి, వ్యాపార కార్యకలాపాలను స్తబ్దుగా మార్చేస్తోంది.
దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ నగల పోటీ తత్వం తగ్గిపోవడమే కాకుండా, ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కళాకారులు, కార్మికుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది. పన్నుల పెరుగుదల వల్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో అనూహ్యంగా పెరగడం వల్ల వివాహాల సీజన్లో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కూడా కౌన్సిల్ ఎత్తిచూపింది.
అందుకే కేవలం పన్నుల పెంపుతోనే సమస్యను పరిష్కరించలేమని, ప్రభుత్వం పరిశ్రమ ప్రతినిధులతో కూర్చుని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని GJEPC డిమాండ్ చేస్తోంది. 22 క్యారెట్లకు బదులుగా తక్కువ క్యారెట్ల నగల వాడకాన్ని ప్రోత్సహించడం, భారతీయుల ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్ని 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' ద్వారా మార్కెట్లోకి తీసుకురావడం వంటి నిర్మాణాత్మక మార్పులు అవసరమని సూచిస్తోంది.
పాత బంగారాన్ని రీసైక్లింగ్ చేసే ప్రక్రియను మరింత సరళతరం చేయడం ద్వారా కొత్త దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బంగారం వాడకాన్ని తగ్గించుకోవాలనే ప్రభుత్వ లక్ష్యానికి తాము మద్దతు ఇస్తున్నప్పటికీ, అది ఒక రంగాన్ని పూర్తిగా దెబ్బతీసేలా ఉండకూడదని జ్యువెలరీ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
