Microsoft lay off: ఉద్యోగులకు షాక్.. 5,500 మందిని తొలగించనున్న మైక్రోసాఫ్ట్..!
లే ఆఫ్స్ భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వణికిపోతున్నారు. ఏ క్షణం ఉద్యోగం ఊడిపోతుందోనని ఆందోళనగా ఉన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతే ఏడాది నుంచి పెద్ద పెద్ద కంపెనీల్లో లే ఆఫ్స్ కొనసాగుతోన్నాయి. తాజాగా దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వచ్చే వారం మరో విడత ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చాలా వరకు ఏఐని వాడడం వల్ల ఉద్యోగాలు పోతున్నాయని అంటున్నారు. అయితే పెద్ద కంపెనీలు భారీ ఎత్తున ఏఐ కోసం ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ కోసం భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైందని తెలుస్తోంది. పెట్టుబడులు పెడుతూనే ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మైక్రోసాఫ్ట్ తన వర్క్ ఫోర్స్ సుమారు 2.5 శాతం మందిని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో దాదాపు 2,20,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 5,500 మంది ఉద్యోగులు.. తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

అయితే మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఉద్యోగుల్ని తొలగించింది. గత ఏడాది మే, జూలై నెలల మధ్య దాదాపు 15,000 ఉద్యోగుల్ని తొలగించింది. ఇది అప్పుడున్న వర్క్ ఫోర్స్ లో 4 శాతానికి సమానం. కాగా ఈ ఏడాది మొదట్లో దాదాపు 8,750 మంది అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛంద నిష్క్రమించే అవకాశం కల్పించింది. ఉద్యోగాల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ ను సంప్రదించగా.. స్పందించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విడతలో సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్బాక్స్ గేమింగ్ విభాగంతో సహా పలు విభాగాలలోని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. లే ఆఫ్ ఫై ప్రకారం 2026లో ఇప్పటివరకు టెక్ కంపెనీలు మొత్తం 1,22,524 మంది ఉద్యోగులను తొలగించాయి.
మూడు రోజుల క్రితం ఓ ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోవడంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ ఇంజనీరింగ్ టీమ్ లో రాత్రికి రాత్రే 150 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు. 1.8 సంవత్సరాలు పని చేసి తర్వాత తనకు రాత్రికి రాత్రే ఉద్యోగం కోల్పోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే టీమ్ మొత్తాన్ని తొలగించిందని పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదని పోస్ట్ లో తెలిపారు. తమ ఇంజనీరింగ్ బృందంలో దాదాపు 150 మంది పని చేస్తారని చెప్పారు. వీరందరికి రాత్రి 9 గంటలకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ కాల్ ఇన్విటెషన్ పంపారని చెప్పారు. మీటింగ్ జాయిన్ అయిన తర్వాత పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీమ్ తొలగిస్తున్నట్లు ప్రకటించారని వివరించారు.


Click it and Unblock the Notifications