Adani: ప్రాణం కాపాడిన గౌతమ్ అదానీ దాతృత్వం.. ఎయిర్ లిఫ్ట్ తో పర్వతారోహకుడికి పునరుజ్జీవం
Adani: బిలియనీర్ గౌతమ్ అదానీ తన మంచి మనసును చాటుకున్నారు. గత నెలలో నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతం వద్ద లోతైన పగుళ్లలో పడి రక్షించబడిన పర్వతారోహకుడు అనురాగ్ మాలూను ఆసుపత్రికి తరలించడంలో సాయం అందించారు. ఖాట్మండు నుండి న్యూఢిల్లీలోని ఎయిమ్స్కు అతడిని తీసుకువెళ్లడానికి సహాయంగా ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు.
అదానీ చేసిన సాయానికి గాను అనురాగ్ మాలూ సోదరుడు ఆశిష్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. గాయపడిన వారిని సకాలంలో విమానంలో తరలించడంపై భావోద్వేగ పోస్ట్ చేశారు. "సకాలంలో ఎయిర్లిఫ్టింగ్ చేసినందుకు మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు! @AnuragMalooని సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో అమూల్యమైన సహకారం అందించిన @gautam_adani మరియు @AdaniFoundationకి హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.
గాయపడిన అనురాగ్ మాలూ రాజస్థాన్లోని కిషన్ గఢ్ నివాసి. ఏప్రిల్ 17న అన్నపూర్ణ పర్వతంపై క్యాంప్ III నుంచి దిగుతుండగా 5 వేల 800 మీటర్ల ఎత్తు నుండి పడిపోయి అదృశ్యమయ్యాడు. మూడు రోజుల పాటు హిమపాతానికి గురై పగుళ్లలో ఉండి బయటపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండగా.. మొదట సమీప వైద్య శిబిరానికి, తరువాత పోఖారాలోని మణిపాల్ ఆసుపత్రికి , ఖాట్మండులోని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించారు.
ఇది ప్రపంచంలోని 10వ ఎత్తైన పర్వతం, ఇది ప్రమాదకరమైన భూభాగానికి ప్రసిద్ధి చెందింది.
నేపాల్ నుంచి ఇండియాకు ఎయిర్ లిఫ్ట్ చేయడం మరియు గ్రౌండ్ ట్రాన్స్ఫర్ కు అయ్యే ఖర్చు తమ శక్తికి మించినదిగా అనురాగ్ కుటుంబం భావించింది. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా అతని కుటుంబం అదానీ ఫౌండేషన్ ను అభ్యర్థించింది. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆయన దాతృత్వ విభాగం అదానీ ఫౌండేషన్ తరఫున ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అతడు న్యూఢిల్లీలోని AIMSలో చికిత్స పొందుతున్నాడు.
ఆశిష్ ట్వీట్ కు గౌతమ్ అదానీ రిప్లై ఇచ్చారు. "ప్రీతి మరియు నేను సహాయం చేయడం విశేషం. అనురాగ్ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాము. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. త్వరలో మరిన్ని జీవిత శిఖరాలను జయించటానికి సిద్ధంగా ఉంటాడని విశ్వసిస్తున్నాము" అని ట్వీట్ చేశారు.