మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరిన అదానీ.. అంబానీ రికార్డ్ బ్రేక్!
బిజినెస్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. తాజాగా భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gowtham adani) మరోసారి సంచలనం సృష్టించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని, సాఫ్ట్బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ను వెనక్కి నెట్టి.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా (Asia's Richest Person) మళ్లీ తన పాత కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
ఫోర్బ్స్ (Forbes) రియల్-టైమ్ బిలియనీర్స్ నివేదిక ప్రకారం.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు విపరీతంగా పెరగడంతో గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. ఈ రేసులో జపాన్కు చెందిన మసయోషి సన్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో అదానీ నంబర్ 1 స్థానానికి దూసుకెళ్లారు.

ముగ్గురు ధనవంతుల నెట్ వర్త్ ఎంతంటే?
ప్రస్తుతం ఆసియా టాప్ 3 కుబేరుల ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి..
- గౌతమ్ అదానీ: 89.2 బిలియన్ డాలర్లు
- ముఖేష్ అంబానీ: 88 బిలియన్ డాలర్లు
- మసయోషి సన్: 87 బిలియన్ డాలర్లు
కేవలం శుక్రవారం ఒక్కరోజే అదానీ ఆస్తి ఏకంగా 2.5 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు అత్యధికంగా సంపాదించిన వారిలో వారెన్ బఫెట్ (3 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానం అదానీదే కావడం గమనార్హం.
రాకెట్లా దూసుకెళ్లిన అదానీ గ్రూప్ షేర్లు!
గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది 2026 లో ఈ షేర్లు 23% నుండి 56% వరకు లాభాలను ఇచ్చాయి. రీసెంట్గా జరిగిన ట్రేడింగ్లో:
- అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు దాదాపు 7% పెరిగాయి.
- అదానీ ఎనర్జీ షేర్లు 4% వరకు జంప్ చేశాయి.
- అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ చెరో 2% లాభపడ్డాయి.
- అదానీ పవర్ కూడా 1% పైగా పెరిగింది.
ఆ వివాదాల నుంచి బయటపడటంతోనే..
గత నెలలో అదానీ గ్రూప్పై ఉన్న ఫ్రాడ్ కేసులను అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కొట్టేసింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టుల కోసం రూ.250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చారనే ఆరోపణలు రావడంతో ఇన్వెస్టర్లు భయపడ్డారు. కానీ ఆ కేసుల నుంచి క్లీన్ చిట్ రాగానే అదానీ సంపద ఏకంగా 10 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతకుముందు 2023 లో హిండెన్బర్గ్ అనే అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ చేసిన ఆరోపణలను కూడా మన దేశ రెగ్యులేటర్లు కొట్టేసి, ఆ ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. దాంతో అదానీ కంపెనీలపై ఇన్వెస్టర్లకు నమ్మకం మరింత పెరిగింది.
ప్రపంచంలో ఎవరి స్థానం ఎక్కడ?
ప్రస్తుత ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 23వ స్థానంలో ఉన్నారు. ఆయన వెనుకే అంబానీ, మసయోషి సన్ ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ (Elon Musk) 800 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఈయన ఆస్తి రెండో స్థానంలో ఉన్న గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్ కంటే రెండింతలు ఎక్కువగా ఉండటం విశేషం. ఏదేమైనా.. ఎన్ని కష్టాలు, ఆరోపణలు ఎదురైనా వాటన్నింటినీ తట్టుకుని అదానీ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications