Adani News: గత రెండు నెలలుగా అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత.. కంపెనీపై ఏ క్షణంలో ఎలాంటి వార్తలు వస్తాయోనని రోజులు గడిపారు. అయితే ఇప్పుడు ఆ ఆందోళనలకు ముగింపు పలికే వార్త ఒకటి ఉంది.
భారీగా అప్పులు తీసుకుని అదానీ గ్రూప్ కొత్త పెట్టుబడులు పెట్టడం.. వాటి ద్వారా వ్యాపారాలను విస్తరించాలని ఒక్కసారిగా చేసిన ప్రయత్నాల నడుమ హిండెన్ బర్గ్ పేల్చటంతో అదానీ గ్రూప్ పెద్ద కుదుపుకు గురైంది. ఇది కేంద్ర రాజకీయాల్లో అతిపెద్ద వివాదంగా మారి చివరికి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు దారితీసిన సంగతి తెలిసిందే.

తాజా వివరాల ప్రకారం.. అదానీ గ్రూప్ మార్చి త్రైమాసికంలో కనీసం 3 బిలియన్ డాలర్ల అప్పులను తిరిగి చెల్లించింది. దీని ద్వారా తాకట్టులో ఉన్న ప్రమోటర్ల వాటాలు తగ్గాయి. అలాగే ఇన్వెస్టర్లు, రుణదాతల ఆందోళనలను తగ్గించటానికి అదానీ గ్రూప్ మూడు దేశీయ మ్యూచువల్ ఫండ్లతో బాండ్లను సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అవగాహన ఉన్న అంతర్గత వ్యక్తులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
రుణాలను తీర్చేందుకు అవసరమైన నిధులను అదానీ విదేశీ పెట్టుబడుల ద్వారా సమకూర్చుకున్నారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన GQG పార్టనర్స్ నుంచి 1.88 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందింది. అలాగే సంస్థ దాదాపు 445.31 మిలియన్ డాలర్ల విలువైన కమర్షియల్ పేపర్స్ చెల్లింపులను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 2.54 బిలియన్ డాలర్లను వెచ్చించి అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ కంపెనీల్లో కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన షేర్లను తాకట్టు నుంచి విడిపించింది.
కంపెనీ ఆర్థిక గణాంకాలను గమనిస్తే.. కంపెనీ చరిత్రలో కేవలం ఒక్క త్రైమాసికంలోనే ఇంత భారీ స్థాయిలో ప్రమోటర్ల వాటాలను విడిపించటం కోసం చెల్లించిన అతిపెద్ద మెుత్తంగా ఉంది. గత కొన్నేళ్లుగా గౌతమ్ అదానీ గ్రూప్ ఎంత అభివృద్ధి చెందిందో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఎంత బాగా కనెక్ట్ అయిందో మారుతున్న గ్రూప్ ఆర్థిక స్థితి, క్రెడిట్ మిక్స్ స్పష్టంగా చూపుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని LIC తన పెట్టుబడులను అదానీ కంపెనీల్లో పెంచటం వరుసగా 7వ త్రైమాసికమని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications