Gautam Adani: అంబానీ బాటలో అదానీ ప్రయాణం.. కుబేరుల కోరిక ఒకటేనా..!
Gautam Adani: అసలే మాంద్యం ఎలాగైనా ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలన్నది ప్రపంచ కుబేరుల ముందు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాలు. దీనిని భారత బిలియనీర్లు సైతం దృష్టిలో ఉంచుకుని తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నారు.
రూటు మార్చిన అదానీ..
దేశంలోనే కాక ఆసియాలో సంపన్న వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ తన కంపెనీల విషయంలో ముఖేష్ అంబానీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అవును ఆయన అదానీ గ్రూప్ పై ఉన్న రుణభారాన్ని తగ్గించేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాంకులు సైతం అదానీ గ్రూప్ కు ఇదే కోరినట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. అందుకే అదానీ గ్రూప్ 5 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకునే పనిలో భాగంగా ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.
బడా ఇన్వెస్టర్స్..
అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్లతో అదానీ చర్చలు జరిపింది. అబుదాబికి చెందిన షేక్ తహ్నూన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సావరిన్ వెల్త్ ఫండ్ ADQకి సంబంధించిన నిధులు సైతం పెట్టుబడుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెుత్తంగా 10 బిలియన్ డాలర్లను సేకరించేందుకు అదానీ గ్రూప్ చర్చించినట్లు సమాచారం.
వచ్చే ఏడాది..
అదానీ గ్రూప్లోని ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వచ్చే ఏడాది నాటికి 1.8 నుంచి 2.4 బిలియన్ డాలర్లను సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిధుల సమీకరణపై చర్చించేందుకు కంపెనీ బోర్డు నవంబర్ 25న సమావేశం అవుతోంది. చర్చలపై అధికారిక ప్రకటన రాకపోగా.. సంబంధిత వర్గాలు దీనిపై స్పందించేందుకు నిరాకరించాయని సమాచారం. ఇది పూర్తైతే కంపెనీకి రుణాల భారంతో పాటు, వాటిపై చెల్లించే వడ్డీ భారం కూడా తగ్గనుంది.
2020లో అంబానీ..
అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రెడిట్సైట్స్ సెప్టెంబర్లో అదానీ గ్రూప్ అప్పులపై సంచలన రిపోర్ట్ ప్రచురించింది. దీంతో అప్పట్లో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయితే తాజాగా అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమైంది. దీని వల్ల కంపెనీ షేర్లలో లిక్విడిటీ సైతం పెరుగుతుందని తెలుస్తోంది. 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా 27 బిలియన్ డాలర్లను సమీకరించారు. తాజాగా అదానీ సైతం అంబానీ బాటలోనే నడుస్తున్నారని మార్కెట్ నిపుణులు అంటున్నారు.